బతుకు సంఘర్షణలోంచే కదా నిప్పులాంటి నిజాలు పుడతాయి. బతుకు మలుపుల్లో ఎన్నో పార్శ్వాల్లో వివిధ సందర్భాల్లో నేను పొందిన అనుభవాలు అనుభూతుల సమాహారమే ఈ కావ్యం అంటారు రచయిత సరికొండ నరిసింహరాజు. మట్టి గణపతి/ పూజించడమంటే/ నేలతల్లిని, ప్రకృతిని పూజించడమే/ (పేజి17), మట్టి గణపతులు చేసే వారికి జీవనోపాధి కలుగుతుంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లదు. దీపాలు వెలిగించి విశ్వేశ్వర తనయునకు హారతియ్యవచ్చు. కాలుష్యం లేని మట్టి గణపతులే పూజనీయం. ‘ఒంటరిగా వచ్చినోడు/ ఒంటరిగానే పోయినట్టే/ ఒంటరితనం శాపమా? వరమా?/ ఒంటరితనం/ ఒక నిత్య సత్యం/ (పేజి
28)’ ఒంటరిగానే జన్మిస్తాడు. ఒంటరిగానే వెళ్లిపోతాడు. మనిషి పోయేటప్పుడు యేమీ తీసికొనిపోడు. వట్టి చేతులతోనే వెళ్లిపోతాడు. ఇది సృష్టిలో జరిగే నిత్యసత్యం. ప్రతి జంతువు నాలుకపై/ అమ్మపాల భాష బీజాక్షరాలు/ నాగరికుడైన మనిషి నాలుకపై/ అన్యభాష ప్లాస్టిక్ అక్షరాలు/ ఎబిసిడి/ (పేజి 39) అమ్మ భాష కంటే మించినదేదీ లేదు. ఈనాడు ‘అమ్మపాల భాష’ కు ఆమోదం లేదని మనవాడు పరాయి భాషకై పరుగులు పెడుతున్నాడు. తెలుగు భాషను దూరం చేయటం ఆత్మహత్యే. ఈ చరాచర జగత్తును/ నడిపేది ఏది గురువర్యా/ నీ ప్రశ్నలోనే సమాధానమున్నది/ వాణికాదు నాయనా/ చరవాణి/ లోకాన్ని చెరపట్టిన రక్కసి/ (పేజి
42) ఈరోజుల్లో చరవాణి ప్రతివ్యక్తి చేతిలోఉంటుంది. ఇది భూ వ్యాప్తమయ్యింది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మోజుతగ్గలేదు. చరవాణి అంటే ఇంతే. రచయిత సరికొండ వాస్తవాలను పుస్తకం తెరపై చూపించారు. సరికొండ నరసింహరాజు కలం నుండి మరిన్ని రచనలు రావాలని కోరిక.
గెల్లి రామమోహనరావు, 0863`2357514
వర్ణాలు లేని వాక్యాలు
(లఘురూప కవిత్వం)
- సరికొండ నరసింహరాజు,
పేజీలు:117, ధర: రూ.150