ఇంఫాల్ : మణిపూర్లోని రాజకీయ పార్టీలు ధన బలం, నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లేదా ఏడీఆర్ చేసిన విశ్లేషణ పేర్కొంది. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులను బీజేపీ అత్యధికంగా నిలబెట్టగా, జేడీ(యూ) తర్వాతి స్థానంలో నిలిచింది. మణిపూర్లో తొలి దశ ఎన్నికలకు పోటీలో ఉన్న 173 మంది అభ్యర్థుల్లో కనీసం 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 16 శాతం మందిపై తీవ్రమైన నేర కేసులు ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లుగా పేర్కొనగా, ఇద్దరు అభ్యర్థులు తమపై హత్య (ఐపీసీ సెక్షన్-302) కేసులను కలిగి ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు తమపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసులు ఉన్నట్లు వివరించారు. మణిపూర్ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగానికి పైగా కోటీశ్వరులేనని ఏడీఆర్ పేర్కొంది. ప్రధాన పార్టీలలో బీజేపీ నుండి 38 మంది అభ్యర్థులలో 11 (29 శాతం), జేడీ(యూ) నుండి 28 మంది అభ్యర్థులలో 7 (25 శాతం), ఐఎన్సీ నుండి 35 మంది అభ్యర్థులలో 8 (23 శాతం), ఎన్పీపీ నుండి 27 మంది అభ్యర్థులకుగాను 3 (11 శాతం) మంది తమపై నేర కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్లలో వెల్లడిరచారు. ప్రధాన పార్టీలలో బీజేపీ నుండి 38 మంది అభ్యర్థులలో 10 (26 శాతం), జేడీ(యూ) నుండి 28 మంది అభ్యర్థులలో 5 (18 శాతం), ఐఎన్సీ నుండి 35 మంది అభ్యర్థులలో 4 (11 శాతం), ఎన్పీపీ నుండి 27 మంది అభ్యర్థులలో 2 (7 శాతం) మంది తమ అఫిడవిట్లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 38 నియోజకవర్గాల్లో ఎనిమిది రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు. మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు నమోదు చేసుకున్న నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు అంటారు.