న్యూదిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ముగిసింది. ఇది చివరి దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్సభ నియోజకవర్గాలలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్సభ సీట్లకు పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో తొమ్మిది, బీహార్లో ఎనిమిది, ఒడిశాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్లో నాలుగు, జార్ఖండ్లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లోక్సభ స్థానానికి శనివారం పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి దాదాపు 200లకుపైగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. మోదీ నియోజకవర్గం వారణాసికి కూడా తుది దశలోనే పోలింగ్ జరగనుంది. తుది విడత పోలింగ్ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా, ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలు వెలువరించనున్నాయి. తుది ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారం చేపడుతుందా? అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అనేది మరో ఐదు రోజుల్లో తేలుతుంది.