రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్
జైపూర్ : వ్యవసాయం కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేక పోయిన అన్నదాతల భూములు వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ అధికారులను అదేశించారు. ఈ మేరకు గురువారం అదేశాలు జారీ చేసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వు బ్యాంకు పరిధిలో పని చేస్తున్న వాణిజ్య బ్యాంకుల నుంచి పంటల కోసం తీసుకున్న రుణాలు చెల్లించని వారి భూములను వేలం వేయడాన్ని నిలుపుదల చేసేలా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రైతుల రుణాలను తమ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసిందని పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో అన్నదాతలు చేసిన రుణాలను వన్టైం సెటిల్మెంటు పద్దతిలో మాఫీ చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో రాష్ట్ర వాటాను భరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐదు ఎకరాలే ఉన్న రైతుల భూముల వేలాన్ని నిషేధిస్తూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా గవర్నర్ అమోదంలేక అది చట్టంగా మారలేదని విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ బిల్లు చట్టంగా మారి రైతుల భూములకు రక్షణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సాగు కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేకపోయిన రైతుల భూములను వేలం వేస్తామని సదరు బ్యాంకుల నుంచి చాలా మందికి నోటీసులు అందడంతో ప్రతిపక్ష బీజేపీ అధికార కాంగ్రెస్ను టార్గెట్ చేయడంతో స్పందించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.