పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ
రైతులకు బాసటగా తమ ప్రభుత్వం నిలుస్తుందని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు. ప్రమాణస్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని తాము కోరుతామని చెప్పారు. ‘రైతుల పోరాటంలో భాగంగా ఉంటూ వారికి న్యాయం జరిగేలా చూస్తాను’ అని ఆయన అన్నారు. రోజువారీ కూలీలు, రైతులతో సహా సమాజంలోని పేద వర్గాలకు తాను ప్రతినిధినని అన్నారు. ‘నేను సంపన్నుల ప్రతినిధిని కాను. పంజాబ్కు చెందిన సామాన్య ప్రజానీకం ప్రతినిధిని’ అని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఉన్న రైతుల నీటి బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయిలను తమ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తుందని సీఎం ప్రకటించారు. రైతులకు మాత్రమే కాకుండా పేదలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తానని చన్నీ పేర్కొన్నారు. ఇసుక మాఫియాపై ఈ రోజే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ చన్నీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.