2021-22లో 56 యూట్యూబ్ వార్తాఛానళ్లు బ్యాన్
న్యూదిల్లీ : కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వెబ్ పేజీలు, సైట్లు, సామాజిక మాధ్యమాల్లోని ఖాతాలపై నిషేధం విధించడం పరిపాటైపోయింది. 2014 నుంచి 2021 వరకు 25,000కుపైగా వెబ్ పేజీలు, సైట్లు, సామాజిక మాధ్యమాల్లోని పేజీలను ప్రభుత్వం నిషేధించింది. 2021
22లో 56 యూట్యూబ్ వార్తాఛానళ్లు, వాటి సామాజిక ఖాతాలను బ్లాక్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 20142021 వరకు వెబ్ పేజీలు, వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లోని పేజీలు, యూఆర్ఎల్లు మొత్తం 25,368ను ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. ఐటీ చట్టం 2000లోని 69ఎ సెక్షన్ అతిక్రమణ పేరిట ఈ చర్యలు తీసుకున్నట్లు లోక్సభకు కేంద్రప్రభుత్వం తెలిపింది. త్రిస్సూర్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ చట్టసభలో 2014 నుంచి వార్తా ఛానళ్లకు ప్రభుత్వం అంతరాయం కలిగించడానికి సంబంధించిన వివరాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. 2014 నుంచి ఎన్ని వార్తా ఛానళ్లు, వార్తాపత్రికలు, మీడియా వేదికలు, ఆన్లైన్ మీడియా వెబ్సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాలను నిషేధించారు? ఎన్నింటిని ఆపివేశారు. ఎన్నింటి ప్రసారాలను/ప్రచురణలను అడ్డుకున్నారో చెప్పగలరా? అని అడిగారు. దీనికి ఐటీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం నిబంధనలను అతిక్రమించే కంటెంట్ను నిషేధించే అధికారం ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు ఉందని చెప్పారు. 2014
2021లో 25,368 వెబ్పేజీలు, సైట్లు, ఖాతాలను నిషేధించామని, 2021`22లో 56 యూట్యూబ్ వార్తా ఛానళ్లను నిషేధించామని, వాటికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లోని ఖాతాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశామని చెప్పారు. మీడియా వన్ గురించి ప్రతాపన్ ప్రశ్నించగా చట్టప్రకారం ప్రభుత్వం నడుచుకుంటోందని, టీవీ వార్తా ఛానల్ మీడియా వన్ అనుమతుల రద్దు నిర్ణయాన్ని పద్ధతి ప్రకారం తీసకున్నదని, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఉందని బదులిచ్చారు. సుప్రీం కోర్టు జనవరి 31న మళయాలం వార్తా ఛానల్ మీడియా వన్పై ప్రభుత్వ నిషేధం మీద స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు స్టే అమలులో ఉంటుందని తెలిపింది. ఇదిలావుంటే, నూతన ఐటీ నిబంధనలను అనేక మీడియా సంస్థలు దేశంలోని వేర్వేరు హైకోర్టుల్లో సవాల్ చేసిన విషయం విదితమే.