న్యూదిల్లీ: రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సీబీఐకి జనరల్ కన్సెంట్(సమ్మతి)ని మేఘాలయ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2018 నుంచి ‘సమ్మతి’ని వెనక్కి తీసుకున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా మేఘాలయ చేరింది. సాధారణంగా తమ రాష్ట్రంలో కేసులను సీబీఐ విచారణ చేయడానికి వీలు లేదంటూ ప్రతిపక్షపార్టీల పాలిత రాష్ట్రాలు మాత్రమే ఇలా చేశాయి. కానీ మేఘాలయలో బీజేపీ మిత్రపక్ష పార్టీ కర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) ప్రభుత్వం ఇలా చేయడం ఆశ్చర్యం కలిగింది. దీనిపై వ్యాఖ్యానించడానికి ప్రభుత్వ అధికారులు నిరాకరించారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడం సాధారణ ప్రక్రియేనని ముఖ్యమంత్రి కర్నాడ్ సంగ్మా తనకు తాను నిన్న అసెంబ్లీ వెలుపల విలేకరులకు చెప్పారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నామని, అయితే అందులో నిర్ధిష్ట తేదీని ప్రస్తావించలేదని తెలిపారు. వాస్తవంగా ఏదేని కేసు విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రావడానికి వీలులేదు. అందుకే రాష్ట్రాల్లో జరిగే అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు, భారీ నేరాలు వంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరుతుంది.