యోగి ఆదిత్యనాథ్ వెల్లడి
లక్నో: ఎన్నికల వేళ రామాలయం అంశాన్ని ప్రస్తావించడం బీజేపీకి అలవాటుగా మారింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి అయోధ్యలో రామాలయం అంశాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయాన్ని 2023 నాటికి పూర్తి చేస్తామని కర్హాల్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో యోగి చెప్పారు. రామమందిరం దేశానికే గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందనుందని యోగి చెప్పారు. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనుల ఆవిష్కరణతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీ…అయోధ్య రామమందిరాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామనే హామీని ప్రజల ముందుకు తీసుకెళ్లింది. వరుసగా రెండోసారి యూపీలో అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మంగా మారింది. ఈ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తుండగా బీజేపీ ఏకంగా కేంద్రమంత్రి ఎస్పీఎస్ బఘేల్ను బరిలో దింపింది. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రెండు పార్టీలు ముమ్మరం చేశాయి. కేంద్రం, రాష్ట్రంలో రెండిరజన్ల ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పుకుంటున్నారు. 2017లో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.86 లక్షలకు పైగా రైతు రుణాలు మాఫీ చేశామని యోగి తెలిపారు. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు దశల పోలింగ్ పూర్తికాగా ఆదివారం మూడోదశ జరుగుతుంది. కర్హాల్ నియోజకవర్గంలో 20న పోలింగ్ జరుగుతుంది.