సుప్రీంకోర్టు
న్యూదిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడిరది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జార్ఖండ్లోని హజారీబాగ్, బీహార్లోని పాట్నాలోని కేంద్రాల్లో నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కావడం వాస్తవమని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడిరచారు. పేపరు లీకేజీకి పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవన్నారు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని, మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని ఆయన పేర్కొన్నారు. వారిలో అనేకమంది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకు పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో పాటు మరికొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం
కాగా, నీట్- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ-దిల్లీ నిపుణుల కమిటీ ఈ రోజు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఆ ప్రశ్నకు రెండు కాదని, ఒకటే సమాధానం ఉందని వెల్లడిరచింది. భౌతికశాస్త్రానికి సంబంధించిన ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్క దానికే వేశారంటూ నిన్నటి విచారణలో పిటిషనర్లు వాదించిన సంగతి తెలిసిందే. ఆ ప్రశ్నకు మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం… ఆ ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన ముగ్గురు నిపుణులను ఏర్పాటుచేసి, ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం లోపు దానిపై సమాధానం సమర్పించాలని ఐఐటీ- దిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే నివేదిక సమర్పించింది.