చండీఘర్ : తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ పంజాబ్ రోడ్వేస్, పీఆర్టీసీలోని కాంట్రాక్టు కార్మికులు సోమవారం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వ బస్సులకు అంతరాయం కలుగగా, ప్రైవేటు బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. పెప్సు రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, పంజాబ్ రోడ్వేస్కు చెందిన రెండువేల బస్సులు ఆగిపోయినట్టు పంజాబ్ రోడ్వేస్, పీఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రేషమ్సింగ్ గిల్ తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు నడుపుతున్న 200 నుంచి 300 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయన్నారు. నిరవధిక సమ్మెతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కార్మికులు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మొహాలీలో ఉన్న ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నివాసం వద్ద ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని వారు హెచ్చరించారు. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండుపై జులై, ఆగస్టుల్లో చర్చలు జరుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, ఇప్పటికి రెండు కేబినెట్ సమావేశాలు జరిగిన తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇక తప్పని పరిస్థితిలో సమ్మెకు పిలుపునిచ్చినట్టు గిల్ వివరించారు.