న్యూదిల్లీ: 2009-17లో ఎన్ఎస్ఈ ఉద్యోగులపై అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్లు రవి నరైన్, చిత్రా రామకృష్ణతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ సంజయ్ పాండేపై సీబీఐ కేసు నమోదు చేసింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నిందితుల ఆస్తులను సోదా చేసినట్లు వెల్లడిరచింది. ముంబై మాజీ పోలీసు కమిషనర్ సంజయ్ పాండేకు దేశంలోని అనేక ప్రాంతాల్లో గల ఆస్తులను తనిఖీ చేసినట్లు తెలిపింది. ఎనిమిది చోట్ల (ముంబై, పూనే, దిల్లీ, లక్నో, కోటా, చండీగఢ్) సోదాలు నిర్వహించామని దర్యాప్తు సంస్థ పేర్కొంది. సీబీఐ ఇంతకుముందు రామకృష్ణను, గ్రూపు ఆపరేటింగ్ అధికారి ఆనంద్ సుబ్రమణియన్నూ అరెస్టు చేసింది. వీరు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే పాండే వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఈయన ముంబై పోలీసు కమిషనర్గా జూన్ 30న పదవీ విరమణ పొందారు. కాగా, పాండే 2001 మార్చిలో ఐసాక్ సెక్యూరిటీని స్థాపించగా ఆ కంపెనీ బాధ్యతలను 2006 మేలో ఆయన తల్లి, కుమారుడు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఐసాక్ సెక్యూరిటీస్ కంపెనీని ఉద్యోగులపై అక్రమంగా ఎలక్ట్రానిక్ నిఘా కోసం ఎన్ఎన్సీ మాజీ ఎండీలు వినియోగించారని సీబీఐ వెల్లడిరచింది.