న్యూదిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సౌత్బ్లాక్లో గల పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలిసంతకం చేశారు. దీంతో 9.3 కోట్లమంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది. తమ ప్రభు త్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. అనంతరం మోదీ మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించినదే కావడం విశేషమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని మోదీ చెప్పారు.
బాధ్యతగా పనిచేద్దాం: మోదీ
బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదని, ఎంతోమంది ఆలోచనల సమాహారమని అన్నారు. పదేళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు.