కర్ణాటకలో వరద నష్టాలపై సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆర్ అశోక నిద్రించడం పట్ల కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ సమావేశంలో మంత్రి అశోక కునుకుతీస్తున్న చిత్రాలను కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నమంత్రి అశోక రెప్పవాల్చిన దృశ్యాలు కనిపించాయి.రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలతో మునిగితే మంత్రి నిద్రలో మునిగితేలుతున్నారని ఈ ట్వీట్లో కన్నడలో రాసుకొచ్చారు. మరోవైపు సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన వరదలపై సమీక్షా సమావేశం ఫోటోలను మంత్రి ఆర్ అశోక కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. భారీ వర్షాలతో కర్ణాటక రాజధాని బెంగళూర్ సహా పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. బెంగళూర్లో వరద పరిస్ధితిని ఎదుర్కొనేందుకు రూ 300 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బొమ్మై తెలిపారు.