Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

కార్మికుల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను గెలిపించండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న సందర్భంలో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలపై చట్ట సభల్లో ప్రశ్నించే కమ్యూనిస్టులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భవానీపురం ఐరన్‌ యార్డ్‌లో ముఠా కార్మికులతో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు చేసే వారు గెలిచిన తరువాత వాటిని సంపాదించుకోవటానికే ప్రయత్నిస్తారన్నారు. కులాలు, మతాలు, డబ్బులు చూడకుండా సమర్ధవంతంగా పని చేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్‌లకు అనుకూలంగా కార్మిక చట్టాలను రద్దు చేసిందని, సంఘం పెట్టుకోవటానికి అవకాశం లేకుండా చేస్తుందన్నారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో ఐరన్‌ యార్డులో షాపు పెట్టి యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ ముఠా వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగవేశారన్నారు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీలకి చెందిన అభ్యర్థులు కరోనా కాలంలో ఎవరికీ ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఈ ప్రాంతంలో కనిపించలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఈ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిందన్నారు. డబ్బు సంచి అందటంలో పార్టీ, అభ్యర్థి మారిపోవటం జరిగిందన్నారు. టీడీపీలో దొంగగా ఉన్న వ్యక్తి బీజేపీలోని వెళ్లగానే మంచివాడైపోయారని ఎద్దేవ చేశారు. కార్మిక వ్యతిరేక బీజేపీకి ఓట్లు వేయవద్దన్నారు. తాను కార్పోరేటర్‌గా పని చేసిన కాలంలోనే ఐరన్‌ యార్డులో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించటం జరిగిందన్నారు. కార్పోరేషన్‌ పరిధిలో చేయగలిగిన కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్‌లు చేయించటం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించానని చెప్పారు. ాా డబ్బులు ఎవరికీ ఊరికే రావు.... ్ణ్ణ అన్నట్లే ఓట్లు ఎవరికీ ఊరికే రావు...కష్టపడే వారికే వస్తాని కార్మికులు నిరూపించాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ాకంకికొడవలి్ణ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌ పత్రంలో సీరియల్‌ నంబర్‌ ఐదు గుర్తుంచుకోవాలన్నారు. అలాగే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీహెచ్‌.బాబూరావుకు ాసుత్తికొవడలినక్షత్రం్ణ గుర్తుపై, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నాంచారయ్యకు, విజయవాడ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్‌కు ాహస్తం్ణ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన సీఐటీయూ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి సీతారాములు మాట్లాడుతూ సుజనా చౌదరి గతంలో ఐరన్‌ యార్డులో షాపు పెట్టి హైదరాబాద్‌ నుంచి వర్కర్లును తెచ్చుకుంటానని ఇక్కడ ముఠా కార్మికులను తీసుకోలేదన్నారు. పోలీస్‌ కమీషనర్‌ను కలిసి అనుమతులు తెచ్చుకున్నారని చెప్పారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు కార్మిక సంఘాలు ఉద్యమించి లేబర్‌ కమీషన్‌పై ఒత్తిడి తీసుకురావటం జరిగిందన్నారు. అనంతర కాలంలో సుజనా చౌదరి ఇక్కడ షాపును మూసేశారని పేర్కొన్నారు. 365 రోజులూ కార్మికులకు అండగా ఉండే కమ్యూనిస్టు నాయకులను గెలించాలని కోరారు.
ఏఐటీయూసీ విజయవాడ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ సంపదను కార్పోరేట్‌లకు కట్టబుడుతున్న కారణంగా ఇండియా కూటమి ఏర్పాటైయిందన్నారు. ముఠా కార్మిక వ్యవస్థను తొలగించేలా పెద్ద పెద్ద అంతర్జాయ స్థాయి మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలపై పోరాడేది వామపక్ష పార్టీలేనని స్పష్టం చేశారు. కార్మికులు, ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసరెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, బత్తు తిరుపతయ్య, కన్నె వెంకటేశ్వర్లు, కృష్ణ, కొండ, కబీర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img