డాక్టర్ జ్ఞాన్పాఠక్
ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశనశలో కాంగ్రెస్, సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీలు కలిసిపోటీ చేసేందుకు పొత్తు కుదుర్చుకున్నాయి. వీటి మధ్య పొత్తు ఉండకపోవచ్చునని అనేకమార్లు సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు బీజేపీ ఆనందపడిరది. పొత్తు కుదర్చుకోవడంతో బీజేపీలో తీవ్ర గుబులు మొదలైంది. అంతేకాదు, తమ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతోంది. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించిన తరువాత ఎన్నికల్లో తమ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. ప్రతిపక్షాలు ఇండియాకూటమిగా ఏర్పడిన తరువాత కొన్ని పార్టీలు కూటమికి దూరమయ్యాయి. ఇది తమకు మరింత అనుకూలమైన పరిస్థితి అని మూడోసారి అధికారంలోకి రావటం సులభమేనని బీజేపీ కేంద్ర నాయకత్వం మైండ్గేమ్ ఆడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ 370 సీట్లు, ఎన్డీఏ 405 సీట్లు గెలుచుకుంటుందని ప్రచారం సాగిస్తున్నారు. చివరకు పార్లమెంటులోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఒక్క మోదీకే చెల్లింది. ఎన్నికలు సమీపించేకొద్దీ యూపీలో రాజకీయ దృశ్యం వేగంగా మరిపోతోంది. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే సందర్భంగా మోదీ మాట్లాడుతూ బీజేపీ 370సీట్లు, ఎన్డీఏ 405 సీట్లు గెలుచుకుంటుందని ఢంకా బజాయించి చెప్పారు. తాజాగా కాంగ్రెస్, ఎస్పీ పొత్తు మోదీకి నిద్ర లేకుండా చేస్తోంది. హిందీభాషా రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ కాంగ్రెస్, ఎస్పీ కలయిక ప్రభావం ఉంటుంది.
రైతుల పోరు ప్రభావం
రైతులకిచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో రైతులు డిమాండ్లను సాధించుకునేందుకు దాదాపు వారం రోజులకుపైగా మళ్లీ ‘ధిల్లీ చలో’ పోరాటాన్ని ప్రారంభించారు. వీరిపైన ప్రభుత్వం ఎంతో కర్కశంగా వ్యవహరిస్తోంది. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక రైతు మృతిచెందగా, అనేకమంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన కొన్ని రాష్ట్రాలలో రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఉత్తరప్రదేశ్ పశ్చిమప్రాంతంలోని రైతులు ఎక్కువమంది ఆందోళనలో పాల్గొంటున్నారు. పంటలకు కనీస మద్దతుధరను చట్టబద్ధం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో మళ్లీ రైతులు పోరాటాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ఎస్పీ పొత్తు తీసుకొచ్చిన మార్పు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు మరో విషయాన్ని పరిశీలించాలి. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలోని రైతులలో ఎక్కువమంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ)తో కలిసి నడవరని అంచనా ఉంది. బీజేపీకి లేదా ఎన్డీఏకి ఈ రైతులు దూరంగా ఉంటారని విశ్లేషిస్తున్నారు. కనీస మద్దతుధరకు చట్టం చేయాలని కోరుతున్నా రైతుల మొర ప్రధాని నరేంద్ర మోదీ ఆలకించడంలేదు. చట్టం తీసుకురావడానికి ఆయన ససేమిరా అంటున్నారు. ఓట్ల కోసం భారత రత్నతో రాజకీయ క్రీడను ఆడుతున్నారు. ఇందుకోసం చౌదరి చరణ్సింగ్కు భారతరత్న అవార్డు ప్రకటించి ఆయన మనవడు జయంత్ చౌదరి నాయకత్వంలో ఉన్న ఆర్ఎల్డీని బీజేపీకి దగ్గర చేసుకున్నారు. ఈ పార్టీ బీజేపీ చెంతకు చేరడంవల్ల కాంగ్రెస్, ఎస్పీలు పొత్తుపెట్టుకునేందుకు తేలికైంది.
ఎస్పీ 62 సీట్లకు, కాంగ్రెస్ 17 సీట్లకు, దళిత నాయకుడు చంద్రశేఖర ఆజాద్ ఏర్పాటుచేసిన అజాద్ సమాజ్పార్టీ ఒక సీటుకు పోటీ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఎస్పీ నాయకత్వంలో ఇండియా కూటమి, బీఎస్పీ విడిగా పోటీచేస్తున్నది. బీజేపీ 2019లో 62 సీట్లు గెలుచుకున్నది. బీఎస్పీ 10, ఎస్పీ 5, కాంగ్రెస్ 1సీటు గెలుచుకున్నాయి. ఎన్డీయేతో కలిసిఉన్న అప్నాదళ్(ఎస్) రెండు సీట్లు గెలుచుకున్నది. బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీచేశాయి. ఈసారి ఒంటరిగా పోటీచేస్తున్న బీఎస్పీకి నష్టం జరగవచ్చునని భావిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి 19.26శాతం ఓట్లు రాగా, 2022 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ ఓట్లు 12.88 శాతానికి తగ్గిపోయాయి. ఈ ఎన్నికల్లో ఇంకా తగ్గ్గే అవకాశంవుంది. ఓబీసీలు పెద్ద సంఖ్యలో ఎస్పీకి మద్దతిస్తున్నారు. బీజేపీకి 2019 లోక్సభ ఎన్నికల్లో 49.56శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్, ఎస్పీఏఎస్పీ కలిసి పోటీచేయడం వల్ల బీఎస్పీకి ఓట్లు మరింతగా తగ్గిపోతాయి. ఈ మూడు పార్టీలకు, బీజేపీకి మధ్య నువ్వా నేనా అన్నంతగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షం 16సీట్లు గెలుచుకుంది. బీఎస్పీకి వచ్చే నష్టం ఇండియా కూటమికి ప్రయోజనం కలిగిస్తుంది. యూపీలో ఎల్లవేళలా దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 36 సీట్లలో బీజేపీకి, ప్రతిపక్షాలకు మధ్య గట్టిపోటీ ఉంటుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 49.56శాతం ఓట్లు రాగా, 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లశాతం 41.29కి తగ్గిపోయింది. 104 సీట్లలో 20వేలలోపు ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపొందింది. 104 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు బీజేపీకి గట్టిపోటీ ఇస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఇతరులు కలిసి 125 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 2సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ ఒక సీటు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీసం 231 సీట్లలో గట్టిపోటీని ఎదుర్కొననున్నది. అసెంబ్లీ నియోజకవర్గాలుగా చూసినట్లయితే లోక్సభ నియోజకవర్గాలలోనూ గట్టిపోటీ ఉంటుంది. 2019 లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు, తాజాగా కాంగ్రెస్, ఎస్పీ కూటమి 36లోక్సభ సీట్లల్లో బీజేపీకి తీవ్ర నష్టం కలిగించవచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే ఇండియా కూటమి 46లోక్సభ సీట్లలో గట్టిపోటీ ఇవ్వనుంది. 2019
2022 మధ్యకాలంలో బీజేపీ ఓట్లు 8.27శాతం తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఎస్పీ ఓట్లు 10.24శాతం నుంచి 32.06 శాతానికి పెరిగాయి. ఈ నేపథó్యంలో బీజేపీ ఈ సారి 22స్థానాలను గెలుచుకోవడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. రామాలయం నిర్మించడం మధుర, కాశీలోని జ్ఞానవాపి తదితరచోట్ల మసీదులను తమకు అప్పగించాలని, అక్కడ ఆలయాలు నిర్మిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలను ఆదేశిస్తున్నారు. అందువల్ల దళితులు, ముస్లింలు ఈసారి బీజేపీకి ఓట్లు వేయకపోవచ్చునని, బీజేపీ నష్టపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.