సంగిరెడ్డి హనుమంతరెడ్డి
భారత రామరాజ్యంలో నాజీ నమూనా పాలన సాగుతోంది. ప్రస్తుతం మోదీ పాలనను హిట్లర్ పాలనతో పోల్చవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం నీడలో జర్మని నరమేధానికి పాల్పడిరది. హిట్లర్60 లక్షల యూదులు, 10 లక్షల పోలండ్ పౌరులు, 2 లక్షల జిప్సీలు, 70 వేల వికలాంగ జర్మన్లు, లెక్కలేనంత మంది రాజకీయ ప్రత్యర్థులను చంపించాడు. 1928లో జర్మన్ పార్లమెంటు రిచ్స్టాగ్లో నాజీ పార్టీకి 2.6% ఓట్లే ఉన్నాయి. 1929 మహామాంద్యంలో బ్యాంకులు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఉపాధులు ఊడాయి. మధ్యతరగతి నిరుపేదలయ్యారు. ఈ స్థితిలో నాజీ అబద్దప్రచారం ప్రజల్లో ఆశలు పెంచింది. 1932కు 37శాతం ఓట్లు సాధించింది. హిట్లర్ జనాలను కుదిపాడు. ‘‘బలమైన దేశాన్ని నిర్మిస్తాను. పాత పాలక తప్పులను దిద్ది జర్మన్ గౌరవాన్ని పెంచుతాను. ఉద్యోగాలిచ్చి యువతకు భద్రత కల్పిస్తాను. జర్మనీ విరుద్ధ విదేశీ కుట్రలను పెకలిస్తాను.’’ఈ వాగాడంబర ప్రచారాలు హిట్లర్ను దేవదూతగా, రక్షకునిగా చిత్రించాయి. 1933 జనవరి30న అధ్యక్షుడు హిండెన్బర్గ్ హిట్లర్ను ఛాన్సలర్ను చేశాడు. హిట్లర్ ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులు, వాక్, పత్రిక, సమావేశ స్వేచ్ఛలను కూల్చాడు. 1933 ఫిబ్రవరి 28 మతోన్మాద, 1933 మార్చి 3 తోడ్పాటు చట్టాలు హిట్లర్ను నియంతను చేశాయి. ఆర్థిక, సైనిక, న్యాయ వ్యవస్థలను హిట్లర్ స్వాధీనపర్చుకున్నాడు. నిఘా, రక్షణ, పోలీసు, నిర్బంధ శాసనరహిత చిత్రహింసలు, సమీకరణ శిక్షాశిబిరాలతో సమాజాన్ని బంధించాడు. జర్మని భయంకర నేర రాజ్యంగా మారింది. 1938కి ఒకే ప్రజ, ఒకే సామ్రాజ్యం, ఒకే నాయకుడు నినాదం మిన్నంటింది.
హిట్లర్ అసమ సమాజంలో జర్మన్ ఆర్య జాతి అగ్రస్థానంలో, యూదులు అధమ స్థానంలో ఇతరులు మధ్యలో ఉన్నారు. యూదులకు డబ్బే దేవుడని, దానికోసం ఏ నేరమైనా చేస్తారని ప్రచారం చేశాడు. స్వచ్ఛ జర్మన్ జాతి నిర్మాణానికి అవాంఛితులను చంపాలన్నాడు. అపవిత్ర జర్మన్లకూ బతికే హక్కు లేదు. భారత మూలాల ఆదిమజాతి, నల్లజాతి, రష్యన్లు, పోలండ్లు, యూదులు, మేధావులు, కమ్యూనిస్టులు నాసిరకంవారు. మానవత్వ అనర్హులు. 1933-‘38 మధ్య యూదులను భయపెట్టారు, పేదలను చేశారు, దేశీయత నుంచి వేరుచేశారు. వారు దేశం వదిలి వెళ్లారు. 1939-1945 మధ్య పోలండ్లో సమీకరణ శిబిరాల్లో, విషవాయు గదుల్లో బంధించి చంపారు. జాతి శుద్ధత పరీక్షలో నెగ్గని పసిపిల్లలను అనాధ శరణాలయాలకు తరలించి కూడూనీళ్లు ఇవ్వకుండా చంపారు. శుద్ధరక్త జర్మన్ జాతీయులే పౌరులు. యూదులు, జర్మన్ల మధ్య వివాహాలు నిషేధం. వివాహేతర సంబంధాలు నేరం. యూదులు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు చెయ్యరాదు. ఆస్తులను అమ్మరాదు. యూదుల ఆస్తులను, ప్రార్థనా స్థలాలను దోచుకున్నారు. కాల్చారు. ఆక్రమించారు. ఈ 1938 నవంబర్ హత్యాకాండ పగిలిన అద్దాల రాత్రిగా పేరుమోసింది. యూదులు ఎదపై పసుపుపచ్చ నక్షత్ర గుర్తును ధరించాలి. ఈ గుర్తున్న వారి సంపదను లాక్కొని ఇరుకుగదుల్లో బంధించి చంపారు.
హిట్ల్ల్లర్కు యువతపై మతోన్మాద ఆసక్తి. వారికి నాజీ భావజాలాన్ని బోధించి బలమైన నాజీ సమాజాన్ని స్థాపించవచ్చని నమ్మాడు. పిల్లలను బడుల లోపల, బయటా నియంత్రించాడు. పాఠశాలలను పవిత్రీకరించాడు. యూదులైన, తాను నమ్మని ఉపాధ్యాయులను తొలగించాడు. పిల్లలను వేరుచేశాడు. జర్మన్లు, యూదులు ఒకచోట కూర్చోరాదు. కలిసి ఆడరాదు. అవాంఛనీయ పిల్లలను అనగా యూదులు, వికలాంగులు, జిప్సీలను బడుల నుంచి వెలేశాడు. విషవాయు గదులకు పంపాడు. జర్మన్ విద్యార్థులకు నాజీ విద్యా విధానంలో సుదీర్ఘ భావజాల శిక్షణ ఇప్పించాడు. పాఠ్య పుస్తకాలను తిరగరాయించాడు.
నాజీ భావ సమర్థనకు జాతివాద శాస్త్రాలను ప్రవేశపెట్టాడు. గణితంలోనూ యూదు వ్యతిరేక ప్రచారం చేశాడు. పిల్లలను యూదు వ్యతిరేకులుగా, నమ్మకస్తులుగా, విధేయులుగా, హిట్లర్ను పూజించేవారిగా బోధనలు చేశారు. క్రీడల్లోనూ పిల్లల మధ్య హింస, శతృత్వ ధోరణులను రేపాడు. ముష్టియుద్ధం పిల్లలను మగ లక్షణాలతో, ఉక్కు మనస్కులుగా, బలంగా చేస్తుందని హిట్లర్ నమ్మకం. యువతలో జాతీయవాదాన్ని నింపే బాధ్యతను యువ సంస్థలకు ఇచ్చాడు. పదేళ్ల పిల్లలు నాజి యువ బృందం జంగ్వోల్క్లో చేరాలి. 14 ఏళ్లకు నాజి యువ సంస్థ ‘హిట్లర్ యూత్’ లో చేరాలి. అక్కడ యుద్ధపూజ, హింస శతృత్వాల కీర్తి, ప్రజాస్వామ్య ఖండన, కమ్యూనిస్టులు, అవాంఛనీయులు, యూదులు, జిప్సీలపై ద్వేషం నేర్చుతారు. కఠిన భావజాల, భౌతిక శిక్షణల తర్వాత 18 ఏళ్లవారు శ్రామికసేవలో చేరతారు. అక్కడ సాయుధ దళాల్లో, నాజి సంస్థల్లో చచ్చేవరకు పనిచేయాలి. సంపూర్ణ శిక్షణ తర్వాత (క్రూర నియంతృత్వ) నాయకుడు ఫ్యూరర్ప్రాతినిధ్య రక్త పతాకం కిందనా శక్తియుక్తులను, బలాన్ని దేశరక్షకుడు హిట్లర్కు అంకితం చేస్తానని, ఆయన కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్దంగా ఉన్నానని, ఇందుకు దేవుడు సాయం చేయాలని ప్రమాణం చేయాలి. నాజీ యూత్ లీగ్ను 1922 లో స్థాపించారు. 4 ఏళ్ల తర్వాత హిట్లర్ యూత్ గా మార్చారు. నాజి నియంత్రణలో యువ ఉద్యమాన్ని ఏకీకృతం చేయడానికి ఇతర యువ సంఘాలను రద్దుచేశారు. నిషేధించారు.
‘‘మగవారి కంటే మహిళలు భిన్నమైనవారని పిల్లలకు నూరిపోస్తారు. ప్రజాస్వామ్య పోరాటాలలో స్త్రీపురుషుల సమాన హక్కుల కోసం పోరాడతారు. ఇది తప్పు. సమాజ నాశకం.’’ఇది నాజీ సూత్రం. అబ్బాయిలకు ఉక్కుమనస్సు, హింస, పురుష గుణాలతో ఉండమని నేర్పుతారు. అమ్మాయిలకు మంచి తల్లులు కావాలని, స్వచ్ఛ ఆర్యన్ రక్తం కల పిల్లలను పెంచాలని బోధిస్తారు. వారు స్వచ్ఛ జాతిని కాపాడాలి. యూదులకు దూరంగా ఉండాలి. స్త్రీలు మగాళ్ళ కార్య ప్రపంచంలో జోక్యం చేసుకోరాదు. ఇంటిని చూసుకోవాలి. పిల్లలకు నాజీ విలువలను నేర్పాలి. ఆర్య సంస్కృతి, జాతి వాహకులుగా మెలగాలి. ‘‘పిల్లలను కనడంలో ప్రకృతి, విధి నిర్ణయించినట్లు జాతి పోరాటంలో స్త్రీలను సమ్మిళితం చేశాము. నా రాజ్యంలో తల్లిప్రధాన పౌరురాలు. నాజీ తల్లులందరూ సమానం కాదు. అవాంఛనీయ జాతిపిల్లలను కన్న తల్లులను శిక్షిస్తాము. వాంఛనీయ పిల్లలను కన్న తల్లులను సన్మానిస్తాము. ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్సనిస్తాము. అంగళ్ళలో, సినిమా, రైల్వే ఛార్జీలలో రాయితీలిస్తాము. అధిక సంతానవతులకు గౌరవ శిలువలను ప్రదానం చేస్తాము. నలుగురిని కన్నవారికి కంచు, ఆరుగురి అమ్మలకు వెండి అంతకు మించి కన్నవారికి స్వర్ణ పతకాలను బహూకరిస్తాము.’’ అని హిట్లర్ 1933 లో ప్రకటించాడు. ఆశయాలను తప్పిన ఆర్య స్త్రీలను బహిరంగంగా కఠినంగా శిక్షించారు. యూదులు, పోలండ్ పౌరులు, రష్యన్లతో సంబంధాలు కొనసాగించిన వారిని గుండుగీయించి, ముఖాలకు నల్లరంగు పులిమి, దేశ గౌరవాన్ని పాడుచేశామని రాసిన అట్టలను మెడలో వేసి ఊరేగించారు. జైళ్ళలో పెట్టారు. ఈ స్త్రీలు ప్రజాగౌరవాన్ని, భర్తలను, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు.
ఆకట్టుకునే నినాద భాషను, మాధ్యమాలను నాజీలు మోసపూరితంగా వాడారు. హింసాప్రణాళికలను సంకేత పదాలతో సూచించారు. బొమ్మలు, సినిమాలు, గోడపత్రికలు, కరపత్రాలతో అనుకూల ప్రచారం చేశారు. ప్రతిపక్షీయులను చీడ తెగులు, పురుగులు, చెదలు, ఎలుకలు, పందికొక్కులు అని తిట్టేవారు. నాజీలే సమస్యలను పరిష్కరించగలరు. మమ్ములనే గెలిపించండన్నారు. మోసపూరిత, ఆకర్షక పదబంధాలు వాడారు. సామాన్య ప్రజలు ప్రపంచాన్ని నాజీ కళ్లతో చూశారు. నాజీ భాష మాట్లాడేవారు. హిట్లరే అభివృద్ధిని సాధించగలడని నమ్మేవారు. యూదులను, నాజీయేతరులను అసహ్యించుకునేవారు.
జర్మన్లందరు నాజీలు కాదు. కొందరు దాడి, చావుకు భయపడకుండా నాజీయిజాన్ని ఎదిరించారు. అధికులు నిరాసక్తిగా ఉన్నారు. పోరాట యోధుడు పాస్టర్ నీమొల్లర్ జనాల నిశ్శబ్దాన్ని, నిరసన పోరాట రాహిత్యాన్ని ఎత్తిచూపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మే 1945 లో జర్మని మిత్రపక్షాలకు (ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా) లొంగిపోయింది. శతృపక్షాల చేతుల్లో అవమానకర మరణాన్ని ఊహించిన హిట్లర్, తన ప్రియురాలు, ప్రచారమంత్రి గోబెల్స్, అతని కుటుంబ సభ్యులు తాము దాక్కున్న బంకర్ (భూగర్భ రక్షణ గృహం) లో ఏప్రిల్లోనే స్వీయహత్య చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీయే పాలన ఇందుకు ఏ మాత్రం తీసిపోదనడంలో ఎటువంటి అనుమానంలేదు.
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి,
సెల్: 9490 20 4545