డాక్టర్ అరుణ్ మిత్ర
నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీ ద్వారా దర్యాప్తు చేయించాలని విద్యార్థులు కోర్టులో దాఖలుచేసిన పిటిషన్లలో కోరారు. దీనిపై పూర్తి విచారణను జులై 8న నిర్వహిస్తామని సుప్రీంకోర్టు తెలియజేసింది.
పరీక్ష నిర్వహణలో 0.001శాతం అశ్రద్ధఉన్నా, వారిపైచర్య తీసుకోవలసిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మెడికల్ కోర్సులకు జాతీయ అర్హత`ప్రవేశపరీక్ష (నీట్) జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. పరీక్ష ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో దేశమంతటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రమైన విమర్శలు చేశారు. తిరిగి పరీక్షలు నిర్వహించాలని కోరుతూ వేలాదిమంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మొత్తం 23లక్షల 33వేల 297 మంది పరీక్షలురాయగా, 720 మార్కులతో ఉత్తీర్ణులైన 67 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇలా 720 మార్కులతో ఇంతమంది ఉత్తీర్ణులు కావడం బహుశ ఇదే మొదటిసారి. ముగ్గురు విద్యార్థులకంటే ఎక్కువ మందికి పూర్తి మార్కులు రావడం 2020లో నీట్ పరీక్షలు రాయడం ప్రారంభించాక ఇంతవరకు జరగలేదు. ప్రశ్నపత్రాలను సమయానికి తమకు ఇవ్వలేదని పైగా, తప్పుడు ప్రశ్నాపత్రాలను అందచేశారని రెండు డజన్లకుపైగా విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఓఎమ్ఆర్ (ఆప్టికల్ మార్క్స్ రికగ్నిషన్) షీట్లను చించివేసి వారి ఫలితాలను జాప్యం చేశారు. అలాగే అనేక వందలమంది విద్యార్థుల ఫలితాలను ప్రకటించకుండా నిలిపివేశారు. నీట్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయి. ఇది ఎంతో తీవ్రంగా తీసుకోవలసిన విషయం. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికిలోనై వికలం చెందుతున్నారు. అనేక వేలమంది ఒకసారికి మించి పరీక్షలు రాస్తున్నారు. ఇలా రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి తట్టుకోలేక చివరకు తమ జీవితాలను అంతం చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నతస్థానాలలో ఉన్న వారి జోక్యం లేకుండా నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఎంతో మేలుచేసినట్టు అవుతుంది. కానీ మంత్రులు సైతం విద్యార్థుల దగ్గర డబ్బు తీసుకుని వారికి ప్రశ్నాపత్రాలను అందచేసినట్లుగా గతంలోనూ, ఆరోపణలు వచ్చాయి. దాదాపు దశాబ్ది క్రితం మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణంలో అనాటి ముఖ్యమంత్రి చౌహాన్తో సహా అనేకమంది మంత్రులు చివరికి ఆనాటి గవర్నర్ కుమారుడు సైతం అక్రమాలకు పాల్పడినట్లు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అందోళన రేకెత్తింది. కొన్ని వందల కోట్లు చేతులు మారాయని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. చివరకి ఎవరూ దోషులుగా తేలలేదు.
నీట్ పరీక్షలో జరిగిన కుంభకోణం వ్యాపం కుంభకోణానికి తీసిపోదని అనేకమంది విమర్శిస్తున్నారు. నీట్ కుంభకోణంలో ఒక రాష్ట్రంలో కొంతమంది విద్యార్థుల నుంచి 30లక్షల రూపాయిలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాలు లీక్ అవడానికి కారకులెవరనేది సుప్రీంకోర్టు ద్వారా స్వతంత్ర కమిటీ దర్యాప్తుచేస్తే అసలు విషయం నిర్ధారణ అవుతుంది. విద్యార్థులకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని ప్రభుత్వం చూపాలి. పరీక్షల నిర్వహణలో తప్పులు జరిగి ఉంటే ప్రభుత్వం అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. కొన్ని విషయాలలో తప్పులు జరిగినమాట నిజమేనని సాంకేతిక శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అనేక ఓఎమ్ఆర్ షీట్లు చింపినవి కనిపించాయి. అందువల్ల ఎన్టీఏ ఈ అవకతవకలకు తానే బాధ్యత వహించాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వం తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆలోచించింది. పరీక్షలు రాసిన వారు మళ్లీ చదువుకొని పరీక్షలు రాయాలంటే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. 1563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ పేర్కొన్నది. మొత్తం అన్ని పేపర్లకు మళ్లీ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఏముంది? మళ్లీ వత్తిడిని ఎదుర్కొని పరీక్షల రాయడంవల్ల ఫలితాలు ఈసారి విద్యార్థులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకవేళ పరీక్షలు రాసినా అందుకు అయ్యే ఖర్చు ఎన్టీఏనే భరించాలి. అనేక దశాబ్దాలుగా వివిధరకాల పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటిని ఏ ఆరోపణలు లేకుండా జరపడంలేదు. విద్యార్థులందరికీ విద్యాబోధన దేశ అభివృద్ధికి, వారు మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది వైద్యులు సైతం అవకతవకలకు పాల్పడుతున్న అంశాలు అనేకసార్లు వెలుగుచూశాయి. నాణ్యమైన విద్యను బోధించడంతోపాటు వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దకుండా పరీక్షల నిర్వహణ ద్వారా డబ్బు గడిరచేందుకు బాధ్యులు ముందుకు రావడం సిగ్గుచేటు.
గతంలో ఇలాంటి కోర్సులలో పన్నెండవ తరగతి అధిక మార్కులతో ఉత్తీర్ణులైనవారిని చేర్చుకునేవారు. విద్యార్థికున్న విస్త్రత పరిజ్ఞానాన్ని అంచనావేసి విద్యార్థులను చేర్చుకునేవారు. ఇటీవల నీట్ ఇంకా ఇతర ఇలాంటి పరీక్షలు రాసే విద్యార్థులకు అనేక కోచింగ్ సెంటర్లు వెలిశాయి. కోచింగ్ తీసుకునేందుకు ఎక్కువగా ఫీజులు చెల్లించవలసి వస్తోంది. కోచింగ్ సెంటర్లలో చదువుకున్నవారు ఎక్కువగా ఉత్తీర్ణులవుతున్నారన్న ప్రచారాన్ని సాగిస్తున్నారు. తద్వారా డబ్బు గడిరచడం పెరిగింది. పేద విద్యార్థులకు ఈ కోర్సులు అందుబాటులో లేకుండా చేశారు. పేద విద్యార్థుల్లో మంచి నైపుణ్యం గలవారు ఉన్నప్పటికీ ఈ విద్య, ఈ వృత్తి ఉద్యోగాలు పొందే అవకాశంలేకుండా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. నీట్పరీక్ష నిర్వహణను తమిళనాడులాంటి కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు అపారంగా పెరగడానికి ప్రభుత్వమే కారణమన్న విషయం అందరికీ తెలిసిందే.