సుదీర్ఘ కాలం కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న కి.శే. జగదీశ్ పీయూష్ 1999లో ‘‘అమేథీ క ఢంక, బిటియా ప్రియాంక (అమేథీÄ కా హళి, ప్రియాంక’’ అని ఓ నినాదం ఇచ్చారు. ఆయన 1977లో సంజయ్ గాంధీ రోజుల నుంచి కాంగ్రెస్తో ఉన్నారు. 1999లో మొట్టమొదటిసారి సోనియా గాంధీ అమేథీ నుంచి పోటీ చేసినప్పుడు పీయూష్ ఈ నినాదం ఇచ్చారు. అమేథీ,ÄÄ రాయబరేలీ కాకుండా ఇప్పుడు ఆమె కేరళలోని వాయనాడ్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇటీవలి ఎన్నికలలో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి, ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నుంచి పోటీచేసి రెండు చోట్లా గెలిచారు. అయితే ఒక సభ్యుడు ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలి కనక ఆయన రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. వాయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. అందుకని ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగవలసి ఉంది. ఆ ఎన్నికలలో ప్రియాంక పోటీ చేయాలని నిర్ణయించారు. గత ఏప్రిల్లో కూడా అమేథీÄ, రాయబరేలీ నుంచి పోటీ చేయవలసిన అభ్యర్థులు ఎవరు అన్న చర్చ జరుగుతున్నప్పుడు ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం ప్రియాంక పోటీ చేయడాన్ని సమర్థించారు. ఆమె పోటీ చేయడానికి సందేహించేట్లయితే తానైనా పోటీ చేస్తానని అన్నారు. 2019లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించడం ద్వారా ప్రియాంక పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. రెండు దశాబ్దాల కిందట రాహుల్ గాంధీ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడే ప్రియాంక కూడా రాజకీయాలలోకి వస్తారని అనుకున్నారు. కానీ తన పిల్లలను పెంచడం తనకు ముఖ్యమని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె కుమారుడు రెహాన్కు 23 ఏళ్లు. కూతురు మిరయాకు 22 ఏళ్లు. తల్లి సోనియా, అన్న రాహుల్ ఎన్నికలలో పోటీ చేసిన సందర్భాలలో ప్రియాంక ఉధృతంగా ప్రచారం చేశారు. సోనియా గాంధీ ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందువల్ల రాహుల్ రాయబరేలీ ప్రతినిధిగా ఉండాలనుకున్నారు. 2019 మార్చిలో ఆమె ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసిదాకా పడవలో గంగా యాత్ర చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అప్పుడు ఓట్లు రాలలేదు. ఆమెను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమిం చినప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూసే బాధ్యత అప్పగించారు. అప్పటి నుంచి ఆమెకు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రియాంకకు హిందీ బాగా వచ్చు. చిన్నప్పుడు ప్రసిద్ధ కవి, అమితాబ్్ బచ్చన్ తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ ఇంట్లోనే గడిపినందు వల్ల హిందీ మీద పట్టు సంపాదించారు. మొన్నటి ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్ కు మధ్య గట్టి బంధం ఏర్పడడానికి ప్రియాంకకు జనంతో ఉన్న సంబంధాలు ఉపయోగపడ్డాయి. దానివల్ల ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలం బాగా కుంచించుకు పోయింది.
ప్రియాంక కనక మోదీపై వారణాసి నుంచి పోటీచేసి ఉంటే ఘనవిజయం సాధించే వారని రాహుల్ గాంధీ అన్నారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ప్రియాంక ప్రచారం జనాన్ని బాగా ఆకట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయానికి ఆమె ప్రచారమే కారణం అన్న మాటా వినిపించింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ చేసిన ఆరోపణలకు ఆమె మాటకు మాట సమాధానం ఇచ్చారు. తన నాయనమ్మ (ఇందిరాగాంధీ), తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం రక్తం చిందించారని ప్రియాంక అనేవారు. త్యాగం గురించి బీజేపీ నాయకులకు ఏం తెలుసు అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రియాంకకు ఈడు రాకముందే ఇందిరాగాంధీకి ఆమె మీద బోలెడు ఆశలు ఉండేవి. ప్రియాంక పేరు దేశంలో మారుమోగుతుందని ఇందిరా గాంధీ అనే వారు. ఈ విషయం ఇందిరా గాంధీకి సన్నిహితుడిగా మెలిగిన ఎం.ఎల్. ఫోతేదర్ తన ‘‘చినార్ లీవ్స్’’ గ్రంథంలో పేర్కొన్నారు. 1984 సెప్టెంబర్ లో ఇందిరా గాంధీ తన మనవడు, మనవరాలిని తీసుకుని కశ్మీర్ లో పర్యటించారు. ఆ తరవాత అక్టోబర్ 31న ఆమె హత్యకు గురయ్యారు. మనవడు, మనవరాలితో కలిసి కశ్మీర్లో పర్యటించినప్పుడు ఇందిరా గాంధీ షారిక భగవాన్ అష్టాదశ్ (18 చేతులుగల) ఆలయాన్ని సందర్శిం చారు. ఆ ఆలయం నెహ్రూ కుటుంబం ఇలవేల్పు అంటారు. అది హరిపర్వతంలో ఉంది. అప్పుడే ఇందిరా గాంధీ సూఫీ సన్యాసి మఖ్దుం సాహిబ్ దర్గా కూడా సందర్శించారు. ఈ దర్శనం అయిపోయిన తర్వాతే ప్రియాంక గాంధీ గురించి ఇందిరా గాంధీ చాలా సానుకూలంగా మాట్లాడారు. ఫోతెదర్తో మాట్లాడుతున్నప్పుడు ఇందిరా గాంధీ తాను ఎక్కువ కాలం బతకను అని కూడా అన్నారు. ప్రియాంక ఎదుగుదలను గమనించాలని ఫోతెదర్కు చెప్పారు. నేను అంతకాలం బతుకుతానా అని ఫోతేదర్ను ప్రశ్నిస్తే తప్పకుండా సజీవంగా ఉంటారు అని కూడా చెప్పారు. ప్రియాంక గాంధీలో జనం తనను చూసుకుంటారని కూడా ఇందిరా గాంధీ అన్నారట. ప్రియాంక రాజకీయాల్లో రాణిస్తారు. వచ్చే శతాబ్దం ఆమెదే అని కూడా ఇందిరాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారట. ఆ తరవాత జనం తనను మరిచిపోతారని కూడా అన్నారట. ఫోతేదర్ 2017 సెప్టెంబర్ లో మరణించారు. ఇందిరా గాంధీని హత మార్చి 40 ఏళ్లయింది. ఆమెను జనం ఏ మేరకు గుర్తుంచుకున్నారో తెలియదు కానీ ప్రియాంకలో నాయనమ్మ పోలికలు మాత్రం కనిపిస్తు న్నాయి. ప్రియాంక వాయనాడ్ నుంచి పోటీచేసి గెలిస్తే కేరళ నుంచి ఎన్నికైన మహిళా ఎంపీ అవుతారు. గెలుపోటముల మాట ఎలా ఉన్నా మొన్నటి ఎన్నికలలో సీపీఐ అభ్యర్థి అనీ రాజా మాత్రం రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇచ్చారు. ‘‘మై లడ్కి హూ, లడ్ సక్తా హూ’’ (నేను మహిళను, పోరాడగలను) అన్న ప్రియాకం మాటలను మాత్రం జనం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
ప్రియాంక కనక వాయనాడ్ నుంచి విజయం సాధిస్తే లోక్సభలో ఆమె ప్రముఖ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడి స్థానం అంగీకరించాలని ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కోరారు. ఆయన ఆలోచించి చెప్తానన్నారు తప్ప ఇప్పటికి ఏ విషయమూ తేల్చలేదు. బహుశ: ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి నెగ్గితే ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించవచ్చు. వాయనాడ్ నుంచి తాను ఎన్నికైతే అక్కడి ప్రజలకు రాహుల్ లోటు తెలియకుండా చేస్తానని ప్రియాంక అన్నారు. వాయనాడ్ ప్రియాంకకు కొత్తేమీ కాదు. 2019 ఎన్నికలలో రాహుల్ తరఫున ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటీవల కూడా వాయనాడ్తో సహా యు.డి.ఎఫ్. అభ్యర్థుల తరఫున అనేక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
అనన్యవర్మ