డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
అకారణంగా తమ తప్పు ఏమీ లేకున్నా బలవంతంగా అమాయక ప్రజలు యుద్ధాలు, తీవ్ర సంక్షోభాలు, హింసాత్మక ఘటనలు, ప్రకృతి వైపరీత్యాల కోరల్లో చిక్కి తమ స్వస్థలాలు తక్షణమే వదిలి ప్రాణరక్షణను దృష్టిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లి తాత్కాలిక ఆశ్రయాలను పొందడం అనాదిగా, అమానవీయంగా జరుగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 20 మంది ప్రజలు శరణార్థులుగా తమ నివాసాలు వదిలి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాలు, పాంతాలకు వలస వెళుతున్నారు. 2018 గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 70.8 మిలియన్ల శరణార్థులు ఉన్నారు. వీరిలో 30 మిలియన్లు 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారే. కుల, మత, జాతి, జాతీయత, సంస్థల్లో సభ్యత్వం, యుద్ధాలు, సంక్షోభాలు, ఇతర ప్రదేశాల్లో ఆశ్రయం కోరడం వంటి కారణాలతో సాధారణ జనులు శరణార్థులుగా మారుతున్నారు. నేడు భీకరంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్-పలస్తీనా యుద్ధాల మూలంగా నేటికి దాదాపు 10 మిలియన్ల శరణార్థులు పొరుగు దేశాలకు, సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. ఇలాంటి శరణార్థులు, ముఖ్యంగా వారి పిల్లలు అనేక అవస్థలు పడుతూ, అమానవీయ దుర్భర జీవితాలను గడుపుతున్నారు.
శరణార్థులు విద్య, వైద్యం, కనీస అవసరాలు లాంటి వసతులకు బహుదూరంగా బతకడం గమనించిన ఐరాస 2001 జూన్ 20న 50వ శరణార్థుల సదస్సు నిర్వహించింది. దానికి గుర్తుగా ఏటా జూన్20న ‘ప్రపంచ శరణార్థుల దినం’గా ప్రకటించింది. ఎలాంటి శరణార్థులకైనా కనీస మానవ హక్కులను కల్పిస్తూ ఆరోగ్య భద్రత, పోషకాహార సరఫరా, పిల్లలకు విద్య, మానసిక ఆరోగ్యం లాంటి వసతులను అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలదే. ఐరాస శరణార్థుల ఏజెన్సీ ద్వారా వైద్య, ఆరోగ్య భద్రత, ఆత్మవిశ్వాసం పెంపుదల, మానసిక ఆరోగ్యం, గౌరవ జీవనోపాధి, సంపూర్ణ రక్షణ, జీవన ప్రమాణాల పెంపుదల, విద్యా వసతులను కల్పిస్తూ, వారి మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ప్రపంచ శరణార్థుల దినం-2024 థీమ్గా ‘శరణార్థుల పట్ల సహానుభూతి, అవగాహన పెంపొందించుకుందాం’ అనే అంశాన్ని తీసుకొని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. శరణార్థుల పిల్లలకు సరైన విద్యా వసతులు కల్పన, వారి భవిష్యత్తు కార్యమ్రాల్లో పాలుపంచుకోవాలి. ప్రపంచ శరణార్థుల దినం వేదికగా శరణార్థుల పిల్లలకు వివిధ వినోద కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, ఆటల పోటీలు, ఆత్మవిశ్వాసం నింపే సదస్సులు, వారి సమస్యలపై విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. శరణార్థులను మానవీయకోణంలో చూస్తూ జనజీవనస్రవంతిలో కలిసే విధంగా చర్యలు తీసుకోవడం, వారి సమగ్రాభివృద్ధికి దోహదపడడం కొనసాగాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది. శరణార్థులను దేశం నుంచి బహిష్కరించడం చేయకుండా ఆ వర్గాలకు కనీస పని, గృహ వసతి, విద్య, వైద్యం, మానవ హక్కులు, స్వేచ్ఛ లాంటి కనీస అవసరాలను సత్వరమే కల్పించాలి.
శరణార్థుల కేంద్రంగా భారత్:
శ్రీలంక తమిళులు, 1947-దేశ విభజన బాధితులు, భారత పునాదులు కలిగిన మైనారిటీలు, 1971 బంగ్లాదేశ్ మారణహోమ బాధితులను భారతదేశ ప్రభుత్వం చట్టరీత్యా శరణార్థులుగా అంగీకరించింది. భారత్కు వలసలద్వారా చేరిన విదేశీయులు తమ దేశానికి తిరిగి వెళ్లకుండా చట్టవ్యతిరేకంగా అక్రమ వలసదారులుగా మన దేశంలోనే తిష్టవేసిన వారిని చట్టవ్యతిరేక శరణార్థులుగా గుర్తించింది. పశ్చిమబెంగాల్, అసోం, త్రిపుర, మేఘాలయ ప్రాంతాల్లో 11.3 మిలియన్లకుపైగా బంగ్లాదేశీ హిందువులు భారత్లో శరణార్థులుగా చేరారని తెలుస్తున్నది. ప్రతి ఏటా 5,000 మంది హిందువులు పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారత్కు చేరుతున్నారని, 1950-2020 మధ్యకాలంలో 3.5లక్షల పాకిస్థాన్ హిందువులు దిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా ప్రాంతాల్లో జీవిస్తున్నారని అంచనా. గత దశాబ్దకాలంలో 99 శాతం అఫ్ఘానిస్థాన్ హిందూ, సిక్కులు భారత్కు శరణార్థులుగా చేరారు. 2020-2050 మధ్యకాలంలో ఏడాదికి 6.9 మిలియన్ల బంగ్లాదేశీయులు భారత్కు అక్రమ వలసదారులుగా వస్తారని అంచనా. ఇటీవల మైన్మార్లో జరిగిన మిలిటరీ దాడితో చట్టవ్యతిరేకంగా అధికసంఖ్యలో అక్రమ వలసదారులు చేరుతున్నారని తెలుస్తున్నది. భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠిన పౌరసత్వ చట్టం తీసుకువచ్చి ఇరుగు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, మైన్మార్ లాంటి దేశాల నుంచి అక్రమ వలసలను అరికట్టకపోతే భారతదేశంలో జనాభా విస్పొటనం జరిగి పేదరికం, అశాంతి పెరుగుతాయి.
సెల్:9949700037