కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, వేధింపులతో ప్రజాస్వామ్యాన్ని హననం చేసి, దేశంలో వున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, తమకు మద్దతు ఇచ్చే విధంగా బీజేపీి నీతి బాహ్య రాజకీయాలు చేస్త్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు పొంది అధికారంలోకి రావడం సహజం. కానీ అందుకు భిన్నంగా రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి తమ పంచన చేరేలా చేయడం, లొంగకపోతే అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, జైలులో పెట్టడం బీజేపీ పాలనలో అలవాటుగా మారింది. తమకు మద్దతు ఇచ్చిన వారు లక్షల కోట్లు దోచుకున్నా, విదేశాలకు పారిపోయినా వారి జోలికి వెళ్లరు. క్రిమినల్ నేరాలకు పాల్పడినవారి జోలికి వెళ్లని దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరేన్ను వెంటాడి వేధించారు. హేమంత్ సొరేన్ కన్నా తీవ్రమైన నేరాలున్న నేతలే బీజేపీ పెద్దల ఆశీస్సులతో అస్సోం సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నారు. ఎవరు నేరంచేసినా శిక్షించాల్సిందే, కానీ ప్రధాని మోదీ హయాంలో దర్యాప్తు సంస్థల తీరు దారుణంగా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడి 5,500 కేసులు నమోదుచేస్తే నేరారోపణ రేటు 23 శాతమే. వాటిలో 25 కోర్టులో ఉన్నాయి. వారిలో రాజకీయ నేతలెవరూ లేరు. దిల్లీ లిక్కర్ స్కామ్లో మంత్రులను జైలులో పెట్టడం, సీఎంకు సమన్లు పంపడం, బీజేపీిలో చేరాలంటూ ఒత్తిడి చేశారని, ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపణలు కేంద్రం వేధింపులను తేటతెల్లం చేస్తున్నాయి. పార్టీలను చీల్చడం, సీఎంలను మార్చడం, వీలైతే సీఎం కుర్చీలో కూర్చోవడం, లేకపోతే రిమోట్ ప్రభుత్వాలను నడపడం, దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం, అక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారింది.
ఆర్థిక నేరాల కేసులను సత్వర విచారణ జరిపి ఏడాదిలోగా తీర్పు వెలువరించాలని కోరతానని 2014 ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన మోదీ అందుకు తీసుకున్న చర్యలు మాత్రం లేవు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన కేసుల్లో 16 నెలలు పాటు జైలు ఊచలు లెక్కించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి 11 ఏళ్లు అవుతుంది. జగన్పై సీబీఐ నమోదు చేసిన కేసులు ఇంత వరకు 3045 సార్లు వాయిదా పడ్డాయి. తీవ్రమైన అభియోగాలు మోపారు. అవి రుజువు అయితే ఏడేళ్లు, వాన్ పిక్ కేసుల్లో అయితే యావజ్జీవ కారాగార శిక్షపడే అవకాశం వున్నా నేర, న్యాయ వ్యవస్థను వెక్కిరిస్తూ అధికారం చెలాయించడం బహుశ భూ మండలంలో సాధ్యపడని విడ్డూరం. ఎంతటి శక్తి మంతులైనా అవినీతిపరుల్ని అంత తేలిగ్గా వదిలి పెట్టవద్దని ఆ మధ్య సివీసీ (కేంద్ర విజిలెన్స్ కమిషన్) ఏర్పాటు చేసిన నిఘా అవగాహన వారోత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.
2014 ఎన్నికల్లో మీకు స్వర్ణాంధ్రా కావాలా, స్కామాంధ్రా కావాలా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రశ్నించిన నరేంద్ర మోదీ నేడు దేశంలో అత్యంత ఆర్థిక నేరస్థుడు జగన్పై వున్న కేసులు ఏళ్ల తరబడి విచారణ ఎందుకు కొనసాగుతున్నాయో, వీరికి కేంద్రం ఎందుకు అండగా నిలుస్తున్నదో ప్రజలకు సమాధానం చెప్పగలరా? ఆర్థిక నేరగాళ్ల బారినపడి భారతదేశం పెద్ద ఎత్తున దోపిడీకి గురైందన్న మోదీ అధికారంలోకి వచ్చి అవినీతికి పాల్పడి, జాతి సంపదను దోచుకున్న వారిపై తీసుకొన్న చర్యలేమిటి? అవినీతిపరుల కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి ఏడాదిలోపు విచారణ పూర్తి చేయించి అవినీతి పరులు చట్టసభలో వుండాలో, జైళ్లలో ఉండాలో తేలుస్తామని హామీ ఇచ్చి పదేళ్లు అవుతుంది. సీబీఐ ప్రాథమిక విచారణలో నిగ్గుతేల్చిన రూ.43 వేల దోపిడీ కేసులో పదేళ్లుగా కేవలం బెయిల్పై వున్న వ్యక్తి అయిదేళ్లుగా వాయిదాలకు కోర్టులకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతూ రాష్ట్రాన్ని పాలిస్తుంటే కేంద్రం, దర్యాప్తు సంస్థలు చోద్యం చూస్తున్నాయి. జేబు దొంగల్ని జైల్లో పెట్ట్టే చట్టాలు వున్నాయి. కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్న వారిపై మాత్రం చర్యలుండవు. లక్షలాది మంది అమాయకులు జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గుతుంటే వేలకోట్ల ప్రజాధనం దోచుకున్న ఆర్ధిక నేరగాళ్లు నీతులు వల్లిస్తూ శాసన నిర్మాతలుగా వెలిగిపోతున్నారు.
ఆర్థిక నేరగాడుగా పేరు మోసిన, వివిధ కేసుల్లో నిందితుడుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగిన జగన్ పరిపాలకుడుగా, ప్రజాధనానికి రక్షకులుగా బాధ్యతలు నిర్వర్తించడం భారతావనిలోనే సాధ్యం. ఆర్థిక నేరస్థుల అంతుచూడటం ఏమో కానీ మోదీ పాలనలో ఆర్థిక నేరస్థులు అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో ఎక్కడ అమలు అవుతోంది? న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకునే వీలులేకుండా పోయింది. ప్రభుత్వ సహకారంతో వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై విచారణ జరిగే తీరు ఇదేనా? ఇంతటి తీవ్రమైన కేసుల విచారణలో మరో సామాన్యుడు వుంటే కేసు విచారణ ఇలానే సాగేదా ? వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన జగన్ పట్ల కేంద్రప్రభుత్వం, సీబీఐ ఉదాశీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? ఆర్థిక నేరస్థులను సహించేది లేదన్న మోదీ విస్పష్ట హెచ్చరిక పసలేనిదిగా మిగిలిపోయింది.
నీరుకొండ ప్రసాద్ , ఫోన్:9849625610