చవేరా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు జులై 4న జరుగనున్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి, కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ ఆకస్మికంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాడు. ఈ ఎన్నికలు 14 ఏళ్ల టోరీల పాలనకు అగ్ని పరీక్ష వంటిది. మొత్తం బ్రిటన్ పార్లమెంటు దిగువసభకు 650 మంది ప్రతినిధులు ఎన్నిక కావల్సిఉంది. లేబరు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. జనవరి వరకు సాధారణ ఎన్నికలకు గడువు ఉన్నప్పటికి దేశంలోని ఆర్థిక, అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో రిషి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. వాస్తవంగా సునాక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంనుంచి బ్రిటన్ పెట్టుబడిదారీ ఆర్థికస్థితి ఇంకా కోలుకోలేదు. ఉద్యోగుల వేతనాల పెరుగుదల ఆగిపోయింది. ప్రభుత్వ ఖర్చులపై సైతం కోత పెట్టవలసి వచ్చింది. ప్రజలు రోజురోజుకు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆ దేశంలో కార్మికుల ఆందోళన పెరిగిపోయి, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. కార్మికుల జీవితాలను పణంగాపెట్టి పెట్టుబడిదారులు బాగుపడాలని భావిస్తున్నారు.
కన్సర్వేటివ్ పార్టీ 2010 నుంచి అధికార పీఠంపై ఉంది. 2010 సాధారణ ఎన్నికలలో డేవిడ్ కామెరూన్ నేతృత్వంలో అత్యధిక స్థానాలను సాధించింది. ఆ తర్వాత నిక్క్లెగ్ నాయకత్వం వహించారు. 2015 లో స్వల్ప మెజారిటీతో కన్సర్వేటివ్ పార్టీ గట్టెక్కింది. 2016 బ్రెగ్జిట్ రెఫరెండమ్ నేపథ్యంలో కామెరున్ ప్రధానిగా రాజీనామా చేశారు. అప్పుడు థెరిస్సా మే దేశానికి నాయకత్వం వహించారు. 2017 లో కన్సర్వేటివ్ మెజారిటీ కోల్పోగా ‘‘డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ ఆఫ్ నార్ద్రన్ ఐలాండ్’’ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టింది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య 2019 లో థెరిస్సా మే రాజీనామా చేసేవరకు ఈ ప్రభుత్వం సాగింది. 2019 నుంచి బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ప్రభుత్వం సాగింది. 2019 నుంచి ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన మంత్రులుగా పనిచేశారు. 2022 సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు అతి స్వల్పకాలంపాటు విజ్ట్రస్ ప్రధానిగా ఉన్నారు. అక్టోబరు 22, 2022 నుంచి రిషి సునాక్ ఇప్పటి వరకు పాలిస్తున్నారు. చివరి ముగ్గురి పాలనాకాలంలో దేశంలో అనేక ఉన్నతస్థాయి కుంభకోణాలు వెలుగు చూశాయి. రెండు ప్రభుత్వ సంక్షోభాల వల్ల కన్సర్వేటివ్లు తమ ప్రాబల్యం కోల్పోయారు. దీనికి తోడు 2022 లో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబరు పార్టీ పుంజుకుని 108 సీట్లలో గెలుపొందింది. 2023 ఎన్నికలలో లేబరు పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 2024 స్థానిక ఎన్నికలలో మరిన్ని విజయాలను సాధించి తన స్థానాన్ని పదిలపర్చుకుంది. కన్సర్వేటివ్ పార్టీ కంటే ఎక్కువ విజయాలను మూట కట్టుకుంది. ఈ పూర్వ రంగంలో ఇప్పుడు పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి.
కన్సర్వేటివ్ పార్టీకి 190 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట దాని పేరు టోరి. 112 ఏళ్ల క్రితమే కన్సర్వేటివ్ పార్టీగా పేరు మార్చుకుంది. ఐనా టోరీలు అని వ్యవహరించటం సాధారణ విషయం. ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునాక్ భారతీయ మూలాలు ఉండి బ్రిటన్లో స్థిరపడిన వ్యక్తి. ప్రస్తుత పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. భారత పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షిత లండన్లో చదువుకుంటూ రిషిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలకాలంలో టోరీల పాలనలో బ్రిటన్ తీవ్ర అస్థిరతకు గురైంది. ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో ఈ అస్థిరత కొట్టవచ్చినట్లుగా కన్పిస్తున్నది. ఆరేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు మారిపోయారంటే ఈ అస్థిరత ఎంత ఎక్కువగా ఉందో అర్థం అవుతుంది.
ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తరన్ ఐర్లాండ్ ప్రాంతాలుగా ఉన్న బ్రిటన్లో మార్పుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, లేబరు పార్టీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికలలో 4 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కన్సర్వేటివ్ పార్టీ గెలిస్తే ఇమ్మిగ్రేషన్ స్థాయిలను తగ్గిస్తామని ప్రధాని రిషి సునాక్ ఎన్నికల ప్రచార సభలో వాగ్దానం చేస్తున్నారు. బ్రిటన్లో ఇమ్మిగ్రేషన్ అనేది చాలా కాలంగా ఒక ప్రధాన రాజకీయ సమస్యగా ఉంది. వలస వచ్చే వారి వల్ల గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా సామాజిక ఐక్యతకు విఘాతం కలిగి గందరగోళ పరిస్థితులు తరుచుగా ఏర్పడుతున్నాయి. ఇతర యూరోపియన్ దేశాల నుంచి స్వేచ్ఛగా బ్రిటన్లోకి వచ్చే వారిని కట్టడి చేయాలని ప్రభుత్వం భావించినా 2015 నుంచి బ్రిటన్కు వలసలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. 2023లో ఆరు లక్షల 85 వేల మంది బ్రిటన్కు వలసలు వచ్చారు. ప్రధానంగా ఉన్నత విద్యకోసం ఎక్కువమంది విద్యార్థులు వస్తున్నారు. ఈ విద్యార్థులకు సంరక్షకులుగా సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనిని నిరోధించేందుకు ప్రధాని సునాక్ కొన్ని చర్యలు తీసుకున్నప్పటికి ఫలితం కన్పించటంలేదు. దీనికి తోడు యూరప్ నుంచి చిన్నచిన్న పడవలలో అనుమతి లేకుండా శరణార్థులు బ్రిటన్లోకి చొరబడుతున్నారు. ఈ కారణంగా బ్రిటన్లో ఇళ్ల అద్దెలు అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్నాయి. ఆర్థిక వెసులుబాటు తగ్గి ప్రభుత్వం బలహీన వర్గాల గృహనిర్మాణ పథకాన్ని రద్దు చేసింది. దేశ జనాభా 6.7 కోట్లు ఉంటే సుమారు కోటిన్నర మంది వరకు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో మూడు లక్షల కుటుంబాలకు అసలు నివాస గృహాలే లేవు. ఇళ్లు లేనివారికి చట్ట ప్రకారం 6 మాసాల పాటు ప్రభుత్వం నివాసం కల్పించాల్సి ఉంది. ఇళ్లులేక వీధుల పక్క, వివిధ ప్రాంతాలలో తల దాచుకుంటున్న పేదలపై 1000 పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జీవన వ్యయం ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నది. ఉచిత ఆహార పొట్లాలకు డిమాండ్ బాగా పెరిగింది. సునాక్ పాలనలో వారి సంఖ్య వేల స్థాయి నుంచి లక్షల స్థాయికి పెరిగిపోయింది. దీనితో శరణార్థుల పట్ల బ్రిటన్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నది. శరణార్థులను పట్టుకుని రువాండ దేశం తరలిస్తున్నారు. అక్కడ వారికి బ్రిటన్లో ఆశ్రయం ఇవ్వాలా వద్దా అనే విషయం నిర్ధారించి పంపిస్తున్నారు. ఇష్టమైనవారు రువాండాలో ఉండవచ్చును లేక ఏ దేశమైనా వెళ్లవచ్చును. అర్హులైన వారిని మాత్రమే బ్రిటన్కు అనుమతి ఇస్తున్నారు. ఈ రకంగా రువాండాతో ఒప్పందం చేసుకుని వేలకోట్ల పౌండ్లు వారికి చెల్లిస్తున్నారు. ఇంగ్లీషు ఛానల్ దాటి వచ్చేవారు పట్టుబడి వెనక్కు తిరిగి వెళితే వారికి 3 వేల పౌండ్లు ఖర్చులు కింద ఇస్తున్నారు. ఈ సమస్యలన్నీ ప్రస్తుత ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.
బ్రిటన్ ఎన్నికలలో ఎవరు గెలిచినా ఆర్థిక వ్యవస్థలోని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. 2016 లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావటం, గ్రూప్ ఆఫ్ సెవన్లో యు.కె. ఆర్థికరంగం బలహీనంగా ఉండటం, ఇంధన ధరలు రష్యా` ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిపోవటం, కోవిడ్ ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితులు, కార్మికుల, వేతన జీవుల అసంతృప్తి, సమ్మె, ఆందోళనలు ఈ ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి. దీనికి తోడు ఆహార ధరల పెరుగుదల అగ్నికి ఆజ్యం తోడైనట్లు ప్రజల అసంతృప్తిని రెట్టింపు చేసింది. దీనితో ఆసుపత్రులు, పాఠశాలలో సమ్మెలు జరిగాయి. దీనివలన దేశ ఆర్థికవ్యవస్థ మరింతగా కుదించబడి పొదుపు చర్యలకు ఉపక్రమించవలసి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలోని సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు క్షీణించి నిరుద్యోగం పెరిగిపోయింది. దేశమంతా అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. ప్రజలు విసిగి, వేసారిపోయారు. ప్రభుత్వ పొదుపు విధానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ విధానాలు వేలాది మంది మృతికి దారితీశాయి. దీనికి తోడు రిషిసునాక్ కుటుంబ సంపద రెండేళ్లలో 12 కోట్ల నుంచి 65.1 కోట్ల పౌండ్లకు పెరిగిందనే కారణంగా ప్రధాని ప్రజాభిమానాన్ని కోల్పోతున్నారు. అందుకే 2024 బ్రిటన్ ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2020 యూరోపియన్ యూనియన్ నుంచి విడివడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.
సెల్: 9392711999