డాక్టర్ సి.క్షేత్రపాల్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. గత పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో తమకున్న మందబలంతో ఇష్టానుసారం చలరేగి పోయింది. ప్రజ్యాస్వామ్యానికి పాతరేస్తూ పాలన సాగించింది. ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కన్ను మిన్ను కానకుండా వ్యవహరించింది. ఈసారి తమకే 370 సీట్లు, తమ కూటమికి 400 పైగా సీట్లు అంటూ మేకపోతు గాంభీర్య ప్రదర్శన చేసింది. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను రద్దు చేయడం తమ భవిషత్తు కర్తవ్యం అంటూ బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లభిస్తే ఏకంగా రాజ్యాంగానికే ఎసరు పెట్టేస్తుందని పసిగట్టిన విజ్ఞత కలిగిన ఓటర్లు బీజేపీకి కళ్లెం వేశారు. ఆ పార్టీని సొంతంగా పాలన చేయలేని స్థితిలోకి నెట్టేసి మిత్రపక్షాలపైనే ఆధార పడేలా గొప్ప గుణపాఠం చెప్పారు. తాను దైవదూతనని దేవుడు పంపాడని ప్రచారం చేసుకొని అహంకారం తలకు ఎక్కించుకున్న మోదీని నేెల చూపులు చూసేలా తీర్పునిచ్చారు.
గతంలో బీజేపీ గెలిచిన 303 సీట్ల నుంచి ఓటర్లు 63 సీిట్లను లాగేసి ఇకనైనా బుద్ది తెచ్చుకొని సంకీర్ణ ప్రభుత్వ పాలన చేయమని ఆదేశించారు. రాముడిని అడ్డంపెట్టుకొని మతతత్వ రాజకీయాలకు పాల్పడిన ఆ పార్టీని అయోధ్య రామాలయం కొలువై ఉన్నచోటనే ఓడిరచి లౌకికవాదానికే భారతీయులు కట్టుబడివున్నారని నిరూపించారు. మతం ప్రజల వ్యక్తిగతం, పాలకుల చేతిలో ఆయుధంగా ఉండడానికి వీలులేదని స్పష్టం చేశారు. 370 ఆర్టికల్ రద్దు తప్పుఅని తేల్చి చెప్పారు. గవర్నర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై చేసిన పెత్తనాన్ని నిరసించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని సహించం అన్నారు. వాగాడంబర నినాదాలను ఇకపై నమ్మం అని స్పష్టం చేశారు. మరోసారి ప్రజాస్వామ్యం జోలికివస్తే ఓటుతో సరైన బుద్ది చెప్పాల్సి వస్తుందనే హెచ్చరిక చేశారు. మోదీ ఇష్టానుసారం వ్యవహరిస్తే నిలువరించడానికి బలమైన అధికార పక్షానికి దాదాపు సమానంగా సీట్లు కట్టబెట్టి బలమైన ప్రతిపక్షం ఉండేలా తీర్పునిచ్చారు. వెరసి ఈ ఎన్నికల్లో మోదీ ఓడి గెలిచారు. ప్రతిపక్షం గెలిచి ఓడిరది.
ఇక రాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల జనంలో అంచలంచెలుగా గూడుకట్టుకున్న వ్యతిరేకత ఓట్ల రూపంలో వ్యక్తం అయింది. తెలిసి తెలిసి చేసిన అనేక స్వయం కృతాపరాధాలే ఆయన్ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయనేది గమనించకుండా ప్రజలంతా తన కోరికలకు అనుగుణంగా మెలగాలి అనే తరహాలో జగన్ సాగించిన పాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసుగు చెందారు. ప్రభుత్వ ఆస్తిని కూల్చడమే మొదటి పనిగా పాలన ప్రారంభించిన జగన్ అభివృద్ధి జాడ కనిపించకుండానే ఐదేళ్లు పాలన చేశారు. రాష్ట్రానికి లభిస్తున్న అదాయానికి అదనంగా పదిలక్షల కోట్లకు పైగా అప్పులుతెచ్చి అందులో సంక్షేమం అంటూ పదోవంతు పంపిణి చేయడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలనుకున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కలేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రీతిలో అన్ని వ్యవస్థలని ఇష్ట ప్రకారం నడిపారు. కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు.
రాష్ట్ర విభజన నాటి ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలతో సతమతమవుతున్నది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన గడచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కు వెళ్లింది. విభజననాటి చట్టంలోని ఏ ఒక్క అంశము పూర్తి కాలేదు. జగన్ అహంభావ, అనాలోచిత నిర్ణయం కారణంగా రాజధాని ఏదో అర్థం కాని అయోమయం ఏర్పడిరది. మూడు రాజధానులు నిర్ణయానికి అడ్డం పడుతున్నారు అనే అక్కసుతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంటు తలుపు తట్టారు. ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అనే చందాన తయారైంది. ఉపాధి కల్పనారంగం అంపశయ్యపైకి చేరింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతుల్లో భయాన్ని కలుగచేసింది. మద్యం అధిక ధరలకి ఎరులైపారింది. రాష్ట్ర భవిషత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేలా చేసింది. యువత ఉపాధి అవకాశాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ప్రభుత్వం వెక్కిరించింది. వలంటీర్ ఉద్యోగమే గొప్ప అన్నట్టు వ్యవహారం నడిపింది. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండరు ఇచ్చి తీరతామని ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీని ఆయన మరచినా నిరుద్యోగ యువత మరువలేదు. వెరసి ఎన్నికల రణరంగంలో పాలకుడికి అహంకారం ఆభరణం కాకూడదనే గుణపాఠం చెప్పి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనేది తాజా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు సారాంశం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు దేశ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఏపీ పాలకుల మద్దతులేకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మనుగడ సాధించలేని స్థితినెలకొంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన గొప్ప అవకాశం. ఈ మంచి అవకాశాన్ని ఏపీలో కొత్తగా కొలువైన చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. గత పదేళ్లుగా ఏపీకి జరిగిన అన్ని అన్యాయాలను సరిదిద్దాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న కేంద్ర ప్రభుత్వం చేత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకాంక్ష ముగిసిన అధ్యాయం కాదని గుర్తించేలా చేయించే అవకాశం కూడా ఉన్నది. విభజన చట్టంలోని అన్ని హామీలను పరిపూర్తి చేయించడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు వెనుక ఉన్న ఆశలని, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉన్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉపాధి అవకాశాల కల్పన ప్రభుత్వ దినచర్యలో భాగం కావాలి. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా మార్చుకొని ముందుకి నడవాలని ఆశిద్దాం.
సెల్: 90598 37847