నంటూ బెనర్జీ
రైలు ప్రయాణికుల భద్రత లోకోపైలట్ల చేతిలో ఉంది. అయితే, వారికి అధిక పనిభారంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు కూడా రైలు ప్రయాణికుల భద్రతను దిగజారుస్తున్నాయి. భారత దేశంలో రైల్వేల ప్రమాణాలు గణనీయంగా పడిపోవడానికి విఫలమైన ప్రైవేటీకరణ బహుశ: ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేనాటికి రైల్వేల ప్రైవేటీకరణ ఆలోచన అంతక్రితం ప్రభుత్వాలకు అంతగాలేదు. మోదీ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రైల్వేలను కూడా ప్రైవేటీకరించేందుకు మోదీ ప్రభుత్వం పూనుకున్నది. దేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజలు రైల్వే ప్రయాణానికి ఇష్టపడతారు. బస్సు ప్రయాణాలు ఇటీవల కాలంలో ఖరీదయ్యాయి. మోదీ హయాంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ తదితర రైళ్లలో ప్రయాణం అత్యంత ఖరీదైనది. ధనికులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగులు వీటిలో ప్రయాణాలు చేస్తున్నారు. సామాన్యులు ప్రయాణం చేసేందుకు సాధారణ బోగీలు కొన్ని రైళ్లలో అసలు ఉండటంలేదు. ఒకవేళ ఉన్నా ఒకటి, రెండు బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ఉన్న వాటిల్లో కూడా ప్రయాణీకులు కిక్కిరిసి ఉంటున్నారు. సాధారణ ప్రజలు ప్రభుత్వాల దృష్టిలో పెద్దగా ఉండటంలేదు. సంపన్నవర్గాలే మోదీ ప్రభుత్వానికి అతి ఇష్టంగా ఉన్నాయి. అత్యధికంగా ఓట్లువేసి గెలిపించే సామాన్యులను పట్టించుకునే ప్రభుత్వం కాదిది. దేశంలో గత ఏప్రిల్లోనే 500 మిలియన్ల ప్రయాణీకులు వివిధ ప్రాంతాలకు ప్రయాణించినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రయాణీకుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అలాగే వస్తురవాణా కూడా పెరిగిపోతోంది. ఈ నెలలో 128.29 మిలియన్ టన్నుల వివిధ పరికరాలు, వస్తువులు, ఖనిజాలు, బొగ్గు తదితరాలు రవాణా అయ్యాయి. ఇందులో 57.64 మిలియన్ టన్నుల ముడి ఇనుము, 5.2 మిలియన్ టన్నుల ఇనుప వస్తువులు, స్టీలు, 6.79 మిలియన్ టన్నుల సిమెంటు, 4.75 మిలియన్ టన్నుల కాలిన బొగ్గు, 3.85 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు, 4.1 మిలియన్ టన్నుల ఎరువులు, 4.16 మిలియన్ టన్నుల చమురు, 6.57 మిలియన్ టన్నుల ఇతర వస్తుసామాగ్రి రవాణా అయ్యాయి. అయితే వీటితో ప్రభుత్వం సంతృప్తి చెందడంలేదు. ఏ విధంగానైనా రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరించాలని 2014 నుంచి కూడా మోదీ ప్రభుత్వం తహతహలాడుతోంది.
మోదీ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి భారత రైల్వేల సంప్రదాయ విధానాలన్నింటికీ తిలోదకాలు ఇస్తున్నారు. 2014లో వివేక్ డెబ్రాయ్ కమిటీని నియమించి రైల్వేలలో ప్రైవేటు వ్యక్తుల పాత్రపై అధ్యయనం చేయమని ప్రభుత్వం కోరింది. అలాగే ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే మంత్రిత్వశాఖ, బోర్డు పునర్నిర్మాణం అంశాలను అప్పగించారు. పూర్తిస్థాయిలో రైల్వేల సరళీకరణ చేయడానికి బదులుగా ప్రైవేటీకరణకు డెబ్రాయ్ కమిటీ ప్రాధాన్యతనిస్తూ నివేదికను సమర్పించింది. 92 సంవత్సరాలుగా రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం 2016నుంచి మార్చివేసింది. పూర్తికాలపు బడ్జెట్లో రైల్వేబడ్జెట్ను కూడా కలిపేసింది. ఆసక్తిఉన్న ప్రైవేటువ్యక్తులు రైళ్ల నిర్వహణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ఇంటికితెచ్చి 109 రూట్లలో రాకపోకలకు 151 రైళ్లను అప్పగించారు. ప్రతిరైలుకు 16బోగీలు ఉండాలని నిర్ణయించారు. మొత్తం రైల్వేలను ప్రైవేటీకరించి తద్వారా 30వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కొంతమంది బిడ్డర్లను ఎంపిక చేసింది. కోచ్లను, ఇంజన్లు, రైల్వే ట్రాక్ల నిర్వహణను మేలుగా చేయాలని ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రైవేటీకరణ నిర్వహించిన ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాలు పెరిగాయి. ప్రైవేటు బిడ్డర్లు ప్రభుత్వంతో సమానంగా భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ప్రాంతంలో ప్రభుత్వం ఆశించింది ఏ మాత్రం జరగలేదు. ఈ ఏర్పాటు పూర్తిగా విఫలమైంది. అయితే ఈ పరిణామాలను ప్రభుత్వం చాలా తేలికగా తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన విధానపరమైన నిర్ణయంలో ఇది భారీ వైఫల్యం. అప్పటినుంచి ప్రభుత్వం రైల్వేలపట్ల శీతకన్ను వేసింది. పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామని మాత్రం ఒక ప్రకటన చేయడానికి పరిమితమవుతున్నది. ఒకప్పుడు రాజకీయ ధీరులైన లాల్బహదూర్శాస్త్రి, జగ్జీవన్రామ్, టీఏ పాయ్, కమలాపతి త్రిపాఠి, ఏబీఏ ఘనిఖాన్ చౌదరి, జార్జి ఫెర్నాండజ్ వంటి యోధులు రైల్వేశాఖను నిర్వహించారు. ఒకసారి రైల్వే ప్రమాదం జరిగినప్పుడు దానికి బాధ్యతవహిస్తూ లాల్బహదూర్శాస్త్రి రాజీనామా చేశారు. ఇలాంటి సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం ఎప్పుడో తిలోదకాలు ఇచ్చింది.
రైల్వేలు ఎదుర్కొంటున్న ఇప్పటి పెద్దసమస్య నిర్వహణ సిబ్బంది భారీ కొరత. మోదీ ప్రభుత్వం ఏనాడూ సిబ్బంది కొరతను తీర్చాలని ఆసక్తి చూపలేదు. క్రమంగా రైల్వేల నిర్వహణ సక్రమంగా లేదని సాకుచూపి పూర్తిగా ప్రైవేటీకరించే ఆలోచనలో ఉన్నది. ఒకసారి ప్రైవేటీకరణ చేయగా, అది విఫలమైన అంశాన్ని సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గత ఏడాది ఫిబ్రవరి 3న రాజ్యసభలో రైల్వే శాఖమంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలో 3.15లక్షల ఖాళీపోస్టులు ఉన్నాయని ప్రకటించారు. తక్కువ సిబ్బందితో రైల్వేలను నిర్వహించడం అనైతికమని, ప్రమాదకరమైందని ప్రభుత్వం గుర్తించడంలేదు. విశ్రాంతిలేకుండా రాత్రిపూట కూడా పనులుచేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించడంలేదు. సిబ్బంది తక్కువగా ఉండటం ప్రమాదాలకు దారితీస్తోంది. లోకోపైలెట్లు పనిచేయడానికి నిర్దేశించిన గంటలకంటే చాలా అధిక గంటలు పనిచేయడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా రైల్వేప్రమాదాలకు ఇది కారణమని దర్యాప్తులు కూడా ఘోషించాయి. ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణం జరిగితే చాలుననే భావనలో ప్రయాణీకులు ఉంటున్నారంటే అతిశయోక్తి ఏమీకాదు. మితిమీరిన గంటలు పనిచేసి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించిన సిబ్బందిని గుర్తించడంలేదు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మోదీ ఇటీవల బాలాశోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత కూడా అప్రమత్తమైన సూచనలు లేవు. ఒడిశాలో జరిగిన ఈ ప్రమాదంలో 300మందికిపైగా మృతి చెందారు. మూడు రైళ్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్న ఘోర ప్రమాదమిది. 2019`2024 మధ్యకాలంలో, నెలకు కనీసం మూడు రైల్వే ప్రమాదాలు జరిగాయి. గత వారం కూడా పశ్చిమ బెంగాల్లోని సీల్దాప్ా వైపు ప్రయాణించే కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో డజనుమందికిపైగా మరణించారు. మరికొన్ని డజన్లమంది గాయపడ్డారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వ కళ్లు తెరుస్తుందని ఆశిద్దాం.