తిప్పినేని రామదాసప్పనాయుడు
ఆత్మాభిమానానికి ప్రతీకలైన రైతులు అప్పుల బాధతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా కొన్ని ప్రైవేట్ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. నేటికీ దేశవ్యాప్తంగా 49శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు 80శాతం వుండేవారు. ఆంధ్రప్రదేశ్లో సగానికి పైగా…అంటే 56 శాతం మంది ఇంకా వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. కోస్తాంధ్రలో ఎక్కువగా పంటలు పండిస్తున్నారు. వరిని ప్రధాన ఆహార పంట కింద పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒకప్పుడు ధాన్య భాండాగారం అని పిలిచేవారు. ఇతర పంటలు తరువాత స్థాయి పంటలుగా పండుతున్నాయి. చెరకు ప్రధాన వాణిజ్య పంటగా రాణిస్తున్నది. జీడిపప్పు, ఏలకులు, తమలపాకులు, ద్రాక్ష పంటలు కూడా కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరుగా పండుతున్నాయి. కాఫీ తోటలు అరకు, పాడేరు కనుమలలో చల్లని వాతావరణంలో విస్తారంగా వున్నాయి. కాఫీ ప్రధాన ఎగుమతిలో దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అరటి, బొప్పాయి, పనస, కొబ్బరి వంటి పండ్లతోటలు కొన్ని ఓ రకంగా వున్నాయి. వాయవ్య, మెట్ట ప్రాంతాలలో, నల్లరేగడి నేలలో పత్తి, నూనె గింజలు, వేరుశనగ పండిస్తున్నారు. మల్బరీ తోటలను (సెరికల్చర్) కొన్ని ప్రాంతాలలో విరివిగా పెంచుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రకాల పంటల రైతులు మిగతా ప్రాంతాల రైతులలాగా సరైన గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం లేక అవస్థపడుతున్నారు. పంటల పెట్టుబడికి తగిన విధంగా రుణాలు లభించక కూడా అవస్థపడుతున్నారు. పంటల ఉత్పత్తులను అమ్ముకోవడానికి కిందిస్థాయి మండీల నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ల వరకు, మిల్లర్ల వద్ద యథాతథంగా దళారీలు తిష్టవేసి నల్లకుబేరులకు, ధనకామందులకు దోచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు బలోపేతం కావడమే శరణ్యం. అలాగే రైతులకు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు సరఫరా చేసేవారి మీద చర్యల కోసం, మోసగిస్తున్న దళారీల ఆగడాలను అరికట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల కోసమే ప్రత్యేకంగా..మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ తరహాలో ‘రైతుల హక్కుల కమిషన్’ ఏర్పాటు చేయాలి. రైతులను మోసం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడానికీ, కేసులు నమోదు చేయడానికి ఏసీబీ తరహాలో ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి. రైతులు కూడా అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా నల్ల వ్యాపారుల నడ్డివిరచడానికి ఇప్పటికే అందుబాటులో వున్న చట్టాల మీద అవగాహన పెంచుకొని స్వయం శక్తితో ఎదగడానికి ఆలోచించాలి. సామూహిక సేద్యం గురించి, సహకార సేద్యం గురించి ఆలోచించాలి. ఇప్పుడు తరుచూ వినబడుతున్న రైతు సంఘాలు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు గ్రామ, మండలాల స్థాయిలో పటిష్టంగా ఏర్పాటు చేసుకొని తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే విధంగా చైతన్యవంతులు కావాలి. ప్రభుత్వం రైతులకు ఎంత చేసినా తక్కువే…అనే విధంగా కొత్త రాయితీలను, ప్యాకేజీలను రైతుల కోసం తీసుకురావాలి. ఆంధ్ర నుంచి ఆహార ధాన్యాలను ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు ముఖ్యంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వ స్థాయిలో కృషి జరగాలి. పంట మార్పిడి విధానాలను, కమతం సేద్యాలను, ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించడానికి ఆ స్థాయిలో చైతన్యవంతులను చేయడానికి ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక కృషి జరగాలి. రైతుల హక్కుల కమిషన్ ఏర్పాటయితే రైతులకు చట్టపరమైన భద్రత, రాజ్యాంగ హక్కులు లభిస్తాయి. ఉత్తరభారతంలో రైతులకు ఉన్న చైతన్యం, ఐకమత్యం ఆంధ్రప్రదేశ్లో రైతులకు లేదు. కొత్తగా కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైతుల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని అనేకమంది రైతులు, రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.