చలసాని వెంకటరామారావు
ప్రశాంత జీవనం సాగిస్తున్న లడఖ్ ప్రాంతంలో బీజేపీ పాలిత కేంద్రప్రభుత్వం 2019 అక్టోబరులో చిచ్చుపెట్టింది. లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో అక్కడ ప్రజలుతీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతకుముందు జమ్ము`కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్న లడఖ్వాసులు ఒక్కసారిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోవటాన్ని జీర్ణించుకోలేక పోయారు. ప్రజాస్వామ్య పద్ధతలో శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. లడఖ్ ప్రజలు ప్రధానంగా తమను 6వ షెడ్యూల్లో చేర్చాలని, తమ ప్రాంతానికి ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతున్నారు. త్రిపుర, మిజోరం రాష్ట్రాలవలే స్వయంప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఈ రాష్ట్రహోదా కల్పించి ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకోవటం, శాసనసభను ఏర్పాటు చేసుకునే ప్రక్రియకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో లడఖ్ ప్రాంతానికి ఒక్కపార్లమెంటు సభ్యుడు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ ప్రాతినిధ్యం రెండు పార్లమెంటుస్థానాలకుపెంచాలని లేప్ా నుండి ఒకరు, కార్గిల్ నుండి మరొకరికి ప్రాతినిధ్యం ఇవ్వాలని తద్వారా తమ సమస్యలుదేశం దృష్టికి తేవచ్చునని వారు భావిస్తున్నారు. రాజ్యాసభలో అసలు తమకు ప్రాతినిధ్యమే లేనందున ఇది అనివార్యమని వారు కోరుతున్నారు. ఇక లడఖ్కు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని వారుకోరతున్నారు. ప్రధానంగా 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ను కేంద్రప్రభుత్వం ఆమోదించటంలేదు. ట్రైబల్స్టేటస్ఇస్తే అటానమస్ కౌన్సిల్స్, జిల్లా, ప్రాంతీయ కౌన్సిళ్ల్లు ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానిక ఎన్నికల ద్వారా ఈ కౌన్సిళ్లను ఎన్నుకుంటారు. ఈ కౌన్సిళ్ల అనుమతులు లేకుండా భూమి, పర్యావరణం వంటి సమస్యలలో, ప్రకృతివనరుల కేటాయింపులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు, ఖనిజసంపద కార్పొరేట్లకు అక్రమంగా అప్పగించే అవకాశం ఉండదుకాబట్టి కేంద్రప్రభుత్వం లడఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చటానికి నిరాకరిస్తున్నది.
‘చిలికి చిలికి గాలి వాన అయినట్లు ‘లడఖ్’ సమస్య ఆ కొండ ప్రాంతంలో పెద్ద సమస్యగా పరిగణించి ఉద్రిక్తతలకు దారితీసింది. 2024 ఫిబ్రవరి నెలలో లడఖ్లో 30వేల మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంటే ఆ ప్రాంత జనాభాలో 10శాతం మంది ప్రజలుఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నట్లు. ఇదిచాలా పెద్దసంఖ్య క్రింద లెక్క. దీనితో ప్రభుత్వం మార్చి 6న చర్చలకు ఆహ్వానించింది కానీ పరిష్కారం దొరకలేదు. రాష్ట్ర హోదాగాని, 6వ షెడ్యూల్లో చేర్చేదానికి ప్రభుత్వం తిరస్కరించంతో చర్చలు విఫలం అయ్యాయి. దీనితో ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావంతుడు, యాక్టివిస్టు సోనమ్ వాంగ్ చుక్ లడఖ్ ప్రజల వేదనను వ్యక్తం చేయడానికి 21 రోజులు నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్షలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క కుదుపు కుదిపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పాలన విధానం ఇక్కడేకాకుండా దేశమంతటా ఇదేరకమైన పద్ధతులు అనుసరిస్తున్నది. హస్దేశ్ ఫారెస్టులో కార్పోరేట్ మాఫియా రాజ్యమేలుతున్నది. మణిపూర్ అడవులలో అగ్నిరాజేసి తగలబెడుతున్నారు. బక్స్వాహాలో మైనింగ్, జోషల్మఠ్ భూమిలోకి క్రుంగిపోవటం వంటివి కార్పొరేట్ మాఫియా విశ్వరూపానికి చిహ్నంగా, ఉత్తరకాశీలో టన్నెల్ కూలిపోవడం, లక్షద్వీప్లో సైతం ఇటువంటి ఘటనలు జరగడం కార్పొరేట్మాఫియా పుణ్యమే. కార్పొరేట్మాఫియా అడుగుపెట్టిన ప్రతిచోటా చెద పురుగులా దేశాన్ని డొల్లచేస్తున్నది. సోనం వాంగ్చుక్ అందరికి పరిచయమైన అమీర్ఖాన్ నటించిన ‘త్రి ఇడియట్స్’ సినిమాలోని ప్రధానపాత్రకు స్ఫూర్తి ప్రధాత. ఈయన యుద్ధరంగంలోని సైనికులకోసం సౌరశక్తితో పనిచేసే ‘సోలార్ హీటెడ్ టెంట్స్’ కనిపెట్టాడు. లడఖ్లోని కార్బన్ న్యూట్రల్ సోలార్ బిల్డింగ్స్ రూపొందించి పర్యావరణానికి తోడ్పడ్డాడు. ఐస్ స్థూపాలు అనే వాటిని నెలకొల్పి నీటిఎద్దడి రోజులలో నీటి సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పరిచారు. ఈయన ‘రామన్ మెగససే’ అవార్డు పొందారు. ఇంకా రియల్ హీరోస్ అవార్డు రోవెక్స్అవార్డు, ఫ్రెడ్ ఎం ఫ్యాక్టరు అవార్డు, గ్లోబల్ అవార్డు ఫర్ సస్టెయినబుల్ ఆర్క్టెక్చరు వంటి పలు అవార్డులను అందుకున్నారు. సోనం వాంగ్చుక్ 21రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేయటం ద్వారా లడఖ్ సమస్య దేశం దృష్టికి వచ్చింది. లడఖ్లో ప్రజాస్వామ్యం, పర్యావరణం, ప్రజల హక్కుల హననం వంటిసమస్యలు దేశప్రజల దృస్టిని అకర్షిస్తున్నాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రకోణం,కార్పొరేట్ ప్రయోజనాలకోసం లడఖ్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ఎలా అణచి వేస్తున్నదో దేశం దృష్టికి వచ్చింది. బయటి ప్రాంత ప్రజలు తమ క్రృతి సంపదను దోపిడీచేయకుండా ఉండాలంటే తమ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చి తీరాలని లడఖ్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. లడఖ్లో అటవీ ప్రాంతం తక్కువ. అయినా ఆరవ షెడ్యూల్ డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ప్రాంతానికి జీవ వైవిధ్యం ఉంటుంది. ప్రకృతి సమతుల్యతకు హిమాలయ ప్రాంతం ఎంతో ముఖ్యమైంది. దీని ప్రభావం మొత్తం దేశం వాతావరణంసై ఉంటుంది. ఇక్కడ గనులు తవ్వి ప్రకృతి సంపదను వెలికితీస్తే, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమై దేశ వాతావరణ స్థితిగతులపై తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిపోవటం వంటి ప్రమాదాలు పెరిగిపోతాయి. ఇటువంటి ప్రమాదాలు నివారించాలంటే ఈ ప్రాంతాన్ని రాజ్యాంగం 6 వ షెడ్యూల్లో చేర్చటం ద్వారా సహజ రక్షణ కల్పించటం అనివార్యం.
లడఖ్ ప్రాంతంలో షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువ. లే రీజియన్లోనే 66.8 శాతం మంది ఉన్నారు. నుబ్రా రీజియన్లో 73.35 శాతం మంది ఉన్నారు. కల్త్సీ రీజియన్లో 97.05 శాతం మంది ఉన్నారు. కార్గిల్ రీజియన్లో 83.49 శాతం మంది ఉన్నారు. సంకు రీజియన్లో 89.96 శాతం ఉన్నారు. వీరి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ రాజ్యాంగ బాధ్యత. అందువల్ల 6 వ షెడ్యూల్లో చేర్చటం, పూర్తి రాఫ్ట్ర హోదా కల్పించి శాసనసభను ఏర్పాటు చేయటం అవసరం. జమ్మూకశ్మీరులో భాగంగా ఉన్నప్పుడు లడఖ్ ప్రాంతంలో ఒక లోక్సభ, నాలుగు శాసనసభ స్థానాలు ఉండేవి. కానీ నేడు ఎటువంటి ఏర్పాటు లేదు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. గతంలో ఆరు సంవత్సరాల క్రితం లడఖ్ ప్రాంతాన్ని 6 వ షెడ్యూల్లో చేర్చాలని బీజేపీ కోరింది. కానీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది. 2019 ఎన్నికల మానిఫెస్టోలో సైతం బీజేపీ దీనిని చెప్పింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ టైమ్స్ (ఎన్సిఎస్టి) సైతం దీనిని రికమండ్ చేసింది. 2020 లో అటానమస్ హిల్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా 15 రోజుల్లో మీ డిమాండ్స్ పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా వాగ్దానం చేసి 15 స్థానాలు గెలుచుకుని మాట తప్పారు. కేవలం కార్పొరేట్ మైనింగ్ మాఫియా చేతుల్లో లడఖ్ భవితవ్యాన్ని నిర్దేశించేందుకే బీజేపీ, నరేంద్రమోదీ, అమిత్షాలు ప్రయత్నిస్తున్నారు. భూమి, అడవులు, నీరు, వ్యవసాయం, పాలనావ్యవస్థ, వారసత్వ హక్కులు, పెళ్లి, విడాకులు, సాంఘిక ఆచారాలు వంటి అంశాలలో చట్టాలు చేసుకునే అధికారం లడఖ్ ప్రజలకు ఉండాలి. లడఖ్ ప్రజల ఆచార, సాంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, ప్రజల మధ్య ఐక్యత చిరకాలం వర్థిల్లాలంటే స్వయం నిర్ణయాధికారం, స్వయం పాలన ఉండాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారి హక్కులను గౌరవించటం అవసరం. అందుకు నేడు లడఖ్ ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారు. పరస్పరం విరోధులుగా ఉన్న బుద్ధిస్టులు, ముస్లింలు కలిసి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్న కేంద్ర పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న లడఖ్ ప్రజలకు యావత్ దేశం మద్దతుగా నిలవాలి.
సీపీఐ రాఫ్ట్రసమితి సభ్యులు
సెల్: 9490952093