తాము అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ, దేశం అమృతకాలంలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక పక్క ప్రచారహోరెత్తిస్తున్నారు. మరోపక్క ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని నివేదికలు ఘోషిస్తున్నాయి. దేశంలోని 41 శాతం మంది జనాభా వంటకు ఇంధనంగా ఇప్పటికీ కట్టెలు, ఆవు పేడ, పిడకల వంటి ఇతర బయోమాస్ పదార్థాలను వినియోగిస్తున్నారని తాజా అధ్యయనం తెలిపింది. దీని వల్ల ఏటా 34 కోట్ల టన్నుల కార్బన్డై ఆక్సైడ్ వాయువు వాతావరణంలోకి విడుదల అవుతున్నదని, ఇది భారత కర్బన ఉద్గారాల్లో దాదాపు 13 శాతమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అనే మేధో సంస్థ ‘ఇండియాస్ ట్రాన్సిషన్ టూ ఈ-కుకింగ్’ నివేదికలో వెల్లడిరచింది. దేశంలో 99.8 శాతం మందికి వంటగ్యాస్ అందుబాటులో ఉన్నదని కేంద్ర పెట్రోలియంశాఖ చెపుతున్న దానిలో ఏమాత్రం వాస్తవంలేదనీ, 41 శాతం మంది ఇంకా బయోమాస్పై వంట చేస్తున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5)లో తేటతెల్లమైందని ఆ నివేదిక తెలిపింది. 50 కోట్ల మంది భారతీయులతో సహా ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు(సుమారు 240 కోట్లు) మందికి వండుకునేందుకు ఇంకా పరిశుభ్రమైన వసతులు అందడం లేదని, దీని వలన పర్యావరణంతో సహా ఆర్థిక వ్యవస్ధ, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతోందని పేర్కొన్నది. అంతర్గత వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది దాదాపు 30 లక్షల మంది ప్రజలు ముందస్తుగా మరణిస్తున్నారని, వీటిల్లో అధికంగా వంటచెరకు ఆధారిత వంట వలనేనని ఈ నివేదిక తెలిపింది. దేశంలోని 99.8 శాతం గృహాలకు వంటగ్యాస్ అందుబాటులో ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్జీ) ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే, 201921లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) జనాభాలో ఇప్పటికీ 41 శాతం మందికి వంటగ్యాస్ అందుబాటులో లేదని తెలిపింది. వీరంతా ఇప్పటికీ వంట కోసం కట్టెలు, పిడకలు, కర్రలు, చెక్కను కోయగా వచ్చే పొట్టు ఇతర బయోమాస్ వినియోగిస్తున్నారు. కలప, ఆవు పేడ లేదా ఇతర జీవపదార్ధాలను వినియోగించి ఈ 41 శాతం మంది ప్రజలు వంట చేయడంతో ప్రతి సంవత్సరం 340 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీఓ2) పర్యావరణంలోకి విడుదలకావడంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సమావేశానికి భారతదేశం అందజేసిన చివరి ద్వైవార్షిక నవీకరణ నివేదిక (బీయూఆర్
3) పై సమీక్ష ఈ నిర్దిష్టరంగాల ఉద్గారాలను జాతీయ ఉద్గారాలలో భాగంగా పరిగణించలేదని పేర్కొంటోంది. భారత్లో ఎల్పీజీ సదుపాయం త్వరగా పొందడానికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం(పీఎంయూవై) బాగా ఉపయోగపడుతోందని, సీఎస్ఈ నివేదిక తెలిపింది. అయితే ఈ పథకం నుంచి లబ్దిపొందిన వారి ఇళ్ల్లలో ‘క్లీన్ కుకింగ్’ దిశగా నిరంతర పరివర్తనకు ఈ పథకం హామీ ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. 2016 మేలో ప్రారంభించిన పీఎంయూవై పథకం ద్వారా 2023 మార్చి వరకు దేశంలోని 10కోట్లకు పైగా కుటుంబాలు ఎల్పీజీ సిలిండర్లను పొందాయి. అయితే, పీఎంయూవై కింద కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు పొందిన వారిలో 50 శాతానికి పైగా కుటుంబాలు కనీసం ఒక్కసారి కూడా రీఫిల్ చేయించుకోలేదని సీఎస్ఈ తన నివేదికలో పేర్కొన్నది. దీనికి వంటగ్యాస్ ధర అధికంగా ఉండడం, తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఎల్పీజీ పంపిణీ నెట్వర్క్ లేకపోవడం, ఇతర నమ్మకాలు వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపింది. గత ఏడాది మార్చి వరకు గృహ వినియోగ సిలిండర్ ధరలు మండిపోయిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను భారీగా పెంచలేదు. సగటు భారతీయ కుటుంబానికి ఏడాదిలో వంట చేయడానికి అలాంటి ఎనిమిది సిలిండర్లు అవసరం. అంటే కేవలం వంట గ్యాస్ కోసమే సంవత్సరానికి సుమారు రూ.8,800 ఖర్చు అవుతుంది. సాధారణ ప్రజానీకం ఇంత మొత్తం భరించలేకున్నారు.
నీతిఆయోగ్ పదవ పంచవర్ష ప్రణాళిక ప్రకారం, దారిద్య్ర రేఖకు దిగు వన ఉన్న (బీపీఎల్) కుటుంబం సగటు వార్షిక ఆదాయం రూ. 27,000కి పరిమితం చేశారు. పీఎంయూవై పథకం ప్రాథమిక లబ్ధిదారులు వీరే. అంటే వీరి సగటు వార్షిక ఆదాయంలో మూడిరట ఒక వంతు వంటగ్యాస్ కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుందని సీఎస్ఈ తెలిపింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, మోదీ ప్రభుత్వం దేశంలో దారిద్య్రాన్ని అదుపులోకి తీసుకు వచ్చాం, 98 శాతానికి పైగా ప్రజలకు వంటగ్యాస్ అందజేస్తున్నాం వంటి తప్పుడు ప్రచారం చేసుకుంటూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో లబ్ధిపొందాలని చూస్తోంది.
ఎం. మురళీకృష్ణ