ఎం. కోటేశ్వరరావు
కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింపచేసి వారి మద్దతుపొందిన వివేక్ రంజన్ అగ్నిహోత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహోత్ర అవధానులయ్యారు. అగ్నిహోత్రి సంఘపరివార్ సభ్యుడా లేక అనేకమంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమారంగ పెద్దమనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూర్ ఫైల్స్ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారిమీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలుచేసి హిందీ సినీరంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచారపర్వంలో భాగంగా కాశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరి పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ5లో ప్రసారం కానుంది. తాము పరిశోధించిన దానిలో పదినుంచి ఇరవై శాతమే ఈ సిరీస్లో చూపనున్నామని, వాస్తవ గాధలను వీటిలో చూస్తారని, తమ పరిశోధన సారాన్ని కాశ్మీరీ ఫైల్స్ సినిమాగా తీశామని అగ్నిహోత్రి చెప్పారు. ఇది రాజకీయ ప్రచారంకోసం అన్నది వేరే చెప్పనవసరం లేదు. కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడుల గురించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ దాచలేదు, వార్తల మీద ఆంక్షలు విధించలేదు. వాటిని అన్ని పార్టీలూ ఖండిరచాయి. నేడు మణిపూర్ ఉదంతాల మీద జరిగినట్లుగా పార్లమెంటు దద్దరిల్లలేదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ కూడా వెలుపలి నుంచి మద్దతు ఇచ్చింది. రాముడి రధయాత్ర పేరుతో 1990 నవంబరు రెండున అయోధ్యకు చేరుకున్న కరసేవకులను నిరోధించేందుకు నాడు అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం కాల్పులు జరపటానికి దారితీసిన పరిస్థితి తరువాత బీజేపీి దానికి నిరసగా కేంద్రంలో విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది తప్ప కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడులకు కాదు. మూడుదశాబ్దాల తరువాత నాటి ఉదంతాలపేరుతో సినిమాతీసిన వివేక్ అగ్నిహోత్రి వర్తమానమణిపూర్ఫైల్స్ గురించి పరిశోధనాలేదు, సినిమాలేదు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం జరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్ అగిహోత్రి ఒక సంఘపరివార్ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువచేసి చూపేందుకు బీజేపీ ఎత్తుగడనే ఆ పెద్దమనిషి కూడా అనుసరించి తన నిబద్దతలో ఎలాంటి సడలింపులేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహోత్రి ట్విటర్ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయవ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కాశ్మీరీ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమౌతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోదీ మీద అదే స్పందన ఎందుకు వెల్లడిరచలేదు ? నిజానికి అగ్నిహోత్రి కడుపు మంట కాశ్మీరీ పండిట్ల మీద స్పందించలేదు అన్నదాని కంటే మణిపూర్ మీద నోరు విప్ప నోరు విప్ప అంటూ ప్రధాని నరేంద్రమోదీ నోటికి వేసుకున్న తాళాన్ని న్యాయవ్యవస్థ తీయించిందన్న దుగ్దను ఆ రూపంలో వెల్లడిరచుకున్నారు. సమయాన్ని వృధా చేయకండి మీరు దమ్మున్న మగాడే అయితే అక్కడికి వెళ్లండి, మణిపూర్ ఫైల్స్ సినిమా తీయండి అని దాని మీద ఒక ట్విట్టర్లో సవాలు విసిరారు. ఒక ప్రముఖుడి నుంచి అలాంటి ట్వీట్ వెలువడితే వేరు. కానీ ఆ సాధారణ ట్వీట్ మీద స్పందించి మీకు నా మీద విశ్వాసం ఉన్నందుకు కృతజ్ఞతలు, కానీ నన్ను అన్ని సినిమాలూ తీయాలంటున్నారు దమ్మున్నవారు ఇంకెవరూ లేరా అని ఎదురుదాడికి దిగి అతి తెలివి ప్రదర్శించారు.
అంతకు ముందు వివేక్ అగ్నిహోత్రి మణిపూర్ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్లో ఇలా ఉంది. ‘‘ మణిపూర్ : మోప్లా, డైరెక్ట్ యాక్షన్ డే ( ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లింలీగ్ నేత జిన్నా అదే ఏడాది జూలైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్, పంజాబ్, కాశ్మీర్, బెంగాల్, కేరళ, అసోం, బస్తర్ ఇప్పుడు మణిపూర్…ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష,ఆటవిక చర్యలకు బలౌతున్నారు.
ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్దమనిషి కవితా స్పందన గురించి చూద్దాం. ‘‘ ఓ మణిపూర్… నేను యత్నించా…నేను యత్నించా… కానీ విఫలమయ్యా……నా నైపుణ్యంతో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాదగాధలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలశ్యం అవుతుంది…… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీ తత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…..మనమందరం మత అతి బాధితులం….. మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం…..మనం భారత పౌరులం, బాధితులం……..స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం…… ఇది నేను కోరుకున్న స్వేచ్ఛ కాదు…. ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది…… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్దమే లేదు…..మనది ఒక విఫల సమాజం…. నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను…. నా తల్లులారా నేను విచారిస్తున్నాను…….భారత మాతా నేను విచారిస్తున్నాను.’’ ఇలా సాగింది ఆ కవిత.
ఇది చదివిన తరువాత ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఏమిటంటే దానిలో ఎక్కడైనా మణిపూర్ దురాగతానికి పాల్పడిన శక్తుల గురించి ఖండన ఉందా ? దాని మీద రెండు ఇంజన్ల పాలకపార్టీ, ప్రభుత్వాల తీరుతెన్నుల మీద అధిక్షేపణ ఎక్కడైనా ఉందా? మూడు దశాబ్దాల క్రితం జరిగిందని చెబుతున్న, అతిశయోక్తులతో కూడిన కాశ్మీరీ ఫైల్స్ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు ? మణిపూర్ గురించి తాను సినిమా తీసేసరికి ఎంతో ఆలశ్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా ?