చింతపట్ల సుదర్శన్
తిని తొంగోడంతోపాటు కూసింత కళాపోషణ చెయ్యాలనుకుంటారు మనుషులు, మరి తమరూ తిని తొంగోవడంతోపాటు తమ కళ అదే భౌభౌ కళను కాస్త పోషించవచ్చు కదా! అంది డాంకీ. అప్పటికే ఊరంతా బలాదూర్ తిరిగి, అలసివచ్చిన డాగీకి అనీజీగానూ, చిరచిర గానూ ఉంది. మనుషుల్లో ప్రతి వాడూ పక్కనోడి తలమీద ఎక్కి కూచుందామనుకునే వాడే. కానీ ఈ డాంకీకి ఆ మాయరోగం అంటినట్టుంది. అయినా అనవసరంగా అస్తమానం మంత్రి పదవిరాని రాజకీయ నాయకుడిలా భౌ భౌ మనడమేనా, అయిందానికీ కాని దానికీ అనే డాంకీ, నన్ను భౌ భౌ మనాలని రెచ్చగొడుతున్నది. ఎందుకో అనుకున్న డాగీ ఆ మాటే అడిగేసింది.
అవసరం వచ్చింది కదా అని శిరోభారమైనా అదే తలనొప్పయినా అడక్క తప్పింది కాదు తంబీ. ఊళ్లో చెడ్డీ గ్యాంగ్ దొంగలు, మధ్యప్రదేశ్ దొంగలు తిరుగుతున్నార్ట. దొంగల్ని పట్టుకునేందుకు పోలీసుల్తోపాటు కుక్కలు కూడా పనిచెయ్యటం ధర్మం కదా మరి. ఓహో అదా సంగతి చెడ్డీ గ్యాంగు, బనియన్ గ్యాంగులూ వస్తే చూసుకోవలసింది పోలీసులే. వాళ్లు పెట్రోలింగ్ వ్యానుల్లో మందేసి నిద్దరోతే, కుక్కలు అరవాలా మాకేమన్నా జీతాలా, భత్యాలా. వాళ్లకూ వాళ్లకూ అండర్స్టాండిరగుంటుంది లే అంది డాగీ ఆవులిస్తూ.
అలాగనకు తమ్ముడూ. ఆ గ్యాంగోళ్లు చెడ్డీలు ఊపుకుంటూ బనీన్లు చింపుకుంటూ మన ఇంటిమీదికి కూడా రావచ్చు కదా. మన ఇంటి మీదికా ఏముందిక్కడ కూలిన గోడలు, రాలే మట్టితప్ప. ఇదేమన్నా పాతిక లక్షల బాత్ టబ్బూ, లక్షల రూపాయల ఔట్లెట్ కుండీలు, అనేక రూపాయల ఖరీదుచేసే ఫ్యాన్లూ, షాండిలర్లు ఉన్న ప్యాలెస్సా, అవన్నీ రాజ్యాల్ని ఏలినోళ్లకుంటయి. ఏలుబడి అయ్యాక వారు అనుభవించిన అలౌకిక ఆనందాలన్నీ తీరుబడిగా ప్రజలకు తెలుస్తయి. మా కష్టార్జితం ఇంత బాగా ఉపయోగపడిరదా? ఏలినవారికి అని నోళ్లు తెరచి ముక్కులు మూసుకుంటారు అంది డాగీ.
నువ్వన్నది అక్షరాలా నిజమేననిపిస్తుంది. నా దగ్గిర వేస్టు పేపర్లూ, నీ దగ్గర నవిలేసిన ఎముక తప్ప ఏం దొరుకుతుంది. దొంగలకి చెడ్డీ లేసుకువచ్చినా, బనియన్లు చింపుకుంటూ వచ్చినా, జీతాలు తీసుకుంటున్నా ఉద్యోగులని పించుకోకుండా, ప్రజాసేవకులని పిలిపించుకుంటూ రాజులు కాకపోయినా రాజభోగాలు అనుభవిస్తూ, అవసరం లేకపోయినా అనేకమంది సలహాదారులనుమేపుతూ, అయిన వాళ్లందరికీ నామినేటెడ్ పదవులిచ్చి కాళ్లు ఒత్తించుకుంటూ ఉండే వాళ్ల మీద పడాలి దొంగలు కాని అప్పులుచేసి ఇళ్లు కట్టుకుని, ఇరుగూపొరుగూ కోసం నగలు కొనే వాళ్లమీద పడ్డం న్యాయంకాదు కదా అంది డాంకీ.
న్యాయం, ధర్మం అనే మాటలు ఇప్పటి వాడుకభాషలో లేవు సుమా. తన్నుమాలిన ధర్మమే లేదను పాతమాటే ఇప్పుడు బేషరతుగా వాడుకలోకి వచ్చింది. ఇక దొంగల సంగతికొస్తే, వాళ్లకి తమ వృత్తి పట్ల ఇంకా బాగా గౌరవం ఉన్నట్టుంది అందుకే తమ జాతివాళ్ల ఇళ్లవైపు పోరు బడాయిమాటలు వద్దు, వృత్తి గౌరవం వంటివి మరీ బరువైన మాటలు. నువ్వు ఉద్దేశించిన ఘరానాదొంగలు, ప్రజాసేవకులవడంవల్ల బోలెడంత ‘సెక్యూరిటీ’ కలిగి ఉంటారన్న కారణంచేత వారి కొంపలవైపు సారీ కోటలవైపు వీరు పోరు అంది డాగీ.
దొరలుగా చెలామణీ అయ్యే దొంగలుగా మారడానికి ఎంతో కృషి అవసరం. ప్రజల సొమ్ముతో తమని తాము అభివృద్ధి చేసుకుంటూ ప్రజాపాలన చేస్తున్నామని పంచుకోడానికి, రాచరికమూ, ప్రజాస్వామ్యమే అని భ్రమకలిగించడానికి ఎంతో శ్రమ అవసరం. అలాగ కృషించీ, శ్రమించీ సంపాదించుకున్న దాన్ని ఒక్క రోజులో ప్రజలు ‘పీకి పాకం’ పెట్టడం చెయ్యగలరు అన్న విషయం నమ్మశక్యంకాని విషయమే అయినా విషంలా మింగక తప్పని పరిస్థితి. ఏ ‘పిత’ కైనా, ఏ బాబుకైనా ఏ బ్రదర్కైనా తప్పదు. స్వానుభవమైతే తప్ప సొంత బ్రాండ్ సారాలో కొట్టుకుపోక తప్పదు అన్న విషయం తెలిసి రాదు అని డాంకీ అంటుండగ అరుగు ఎక్కాడు అబ్బాయి.
ఊళ్లోకి దొంగల గ్యాంగులు దిగాయంట. తొందరగా వెళ్లాలి అంటూ తన జాగాలో కూచున్నాడు. అయితే అన్నా అయిదేళ్లకోసారి ప్రజలు దొంగల్ని దొరలుగా మారుస్తారు కదా, ఆ దొరలు దొరతనం పోయేక మళ్లీ అయిదేళ్లదాకా ఏం చెయ్యాలి గోళ్లు గిల్లు కోవాలి అంది డాగీ. గోళ్లు గిల్లుకోడం ఎందుకూ? కళ్లు మూసుకుంటే సరి. ఈ మధ్య ఓ లీడరు చెప్పిన శ్రీరంగనీతుల్లో ఇది ఒకటి. ఐదేళ్లు అలా కళ్లుమూసుకుంటే ఇలా ఎన్నికలు వచ్చేస్తయి. అప్పుడు మళ్లీ మనమే దొరలమై ఏలుదాం అన్నది ఆ నీతి. కళ్లు మూసుకోవలసింది ఎవరు ప్రజలా? అంది డాంకీ. కాదు మళ్లీ మళ్లీ దొరతనం కలలుకనే వారు. ప్రజలు కళ్లు మూసుకోరు. పిల్లి కళ్లు మూసుకున్నట్టు మూసుకుని తమను ఎవరూ ఏమీ చేయరు అనుకునే వాళ్లేవాళ్ల దెబ్బకు ‘ఠా’ అంటారు అన్నాడు అబ్బాయి.
దెబ్బకు ఠా! దొంగల ముఠా! అన్నమాట
భలే భలే..అంది డాగీ.