శిరందాసు నాగార్జున
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈ సారి ఎవరి అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. వివిధ సంస్థల సర్వేల ఫలితాలు నమ్మేవిధంగా లేవు. కొన్ని ఏకపక్షంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయా పార్టీల తరఫున ఆ సర్వేలు ప్రకటిస్తున్నట్లుంది. బీజేపీ, జనసేనతో జతకట్టి టీడీపీ పోటీ చేస్తుండగా, ్ సీపీఐ, సీపీఎం పొత్తుతో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. వైసీపీ మాత్రం గతంలో మాదిరి ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎన్నికలంటే విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు తారాస్థాయిలో వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఏపీలో రాజకీయ విమర్శల్లో భరించలేని బండ బూతులు కూడా వచ్చేశాయి. ‘‘ఈ ఎన్నికలు ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం… తాము సిద్ధం’’ అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీని ఓడిరచాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాజధాని అమరావతి, మూడు రాజధానుల అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మనకు స్పష్టంగా తెలుస్తోంది.
వివిధ పార్టీల ఆలోచనలు క్లుప్తంగా పరిశీలించినట్లైతే.. ‘‘సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన పేదలతోపాటు క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాపులు, సీఎం సామాజిక వర్గంవారు, వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది మాకు ఓట్లు వేస్తారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలలోని అన్ని కులాల వారిని గుర్తించి, ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాజ్యసభ, శాసనమండలి సభ్యుల పోస్టులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సామాజిక న్యాయం పాటించాం. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధాలకు కట్టుబడి ఉన్నాం. లోక్సభ, శాసనసభ సీట్ల విషయంలో కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమేగాక, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, మహిళల విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించాం. వారికి 50 శాతం సీట్లు కేటాయించాం. ఇవే మమ్మల్ని రెండవసారి విజయ తీరాలకు చేరుస్తాయి.’’ అని వైసీపీ భావిస్తోంది. ‘‘ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాపులు, చంద్రబాబు సామాజిక వర్గం వారు, మధ్య, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు మాకు ఓట్లు వేస్తారు. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి. అమరావతితోపాటు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరది. వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక, మద్యం, మైనింగ్, గంజాయి ద్వారా వైసీపీ నేతలు కోట్ల రూపాయలు గడిరచారు. అన్ని వర్గాల ప్రజలకు వేధింపులు ఎక్కువైపోయాయి. పోలీసుల రాజ్యం కొనసాగుతోంది. విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు. అభివృద్ధి, ఉపాధి టీడీపీతోనే సాధ్యం. ఈ అంశాలే మమ్మల్ని గెలిపిస్తాయి’’ అని టీడీపీ నమ్మకంతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీని ఏపీలో పెద్దగా లెక్కలోకి తీసుకోవలసిన అవసరంలేదు. పార్లమెంట్ తలుపులు మూసి, చర్చ లేకుండా, అన్యాయంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందన్న అభిప్రాయంతో ఏపీ ప్రజలు ఉన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల విషయానికి వస్తే అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలో, రాష్ట్ర ప్రజలలో ఎక్కువ మందికి ఇష్టంలేదు. ఈ పొత్తువల్ల ముస్లింలు అత్యధిక మంది టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వంటి అంశాల విషయంలో రాష్ట్ర ప్రజలు బీజేపీ అంటే మండిపడుతున్నారు. అంతేకాకుండా, వైసీపీతో బీజేపీకీ లోపాయకారి ఒప్పందం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనేక కేసులలో నిందితుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాకపోవడానికి, కనీసం కోర్టుకు హాజరుకాకపోవడానికి కూడా బీజేపీ మద్దతే కారణంగా భావిస్తున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో మూడు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జగన్ని ఒక్క మాట కూడా అనకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇక సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన విషయంలో జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాపువర్గం నుంచి కూడా జనసేనకు అనుకున్న స్థాయిలో మెజార్టీ లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గం నుంచి ముద్రగడ పద్మనాభం వంటి ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదు. వైసీపీ ఒంటిగా పోటీ చేస్తున్నప్పటికీ, అభ్యర్థులను పదే పదే మార్చి ప్రకటించడం, జాప్యం వంటి అంశాలు ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సారి ఎన్నికలు గతంలో మాదిరి ఏకపక్షంగా ఉండే అవకాశం మాత్రం లేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. అభివృద్ధి, సంక్షేమంకంటే కులాల ప్రభావం కూడా ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ఉంటుంది. ఈ ఎన్నికలు చాలా పోటాపోటీగా జరుగుతాయి.
సీనియర్ జర్నలిస్ట్. సెల్: 9440222914