డాక్టర్ సోమ మర్ల
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ మొదటి కేబినెట్ సమావేశంలో 14 పంటలకు కొత్త మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. పెంపు చాలా తక్కువగా, 5 నుంచి 7 శాతం మధ్య ఉంది. అవిశెలు, రాగి మినహా మిగిలిన పంటల పెరిగిన మద్దతుధర సాగు వ్యయాన్ని ప్రతిబింబించడం లేదు. ఉదాహరణకు వరి ధర క్వింటాల్కు కేవలం రూ.550 మాత్రమే పెరిగింది. ప్రధాన ఖరీఫ్ పంట అయిన వరి కనీస మద్దతు ధర 2023లో రూ. 2,183 నుంచి 2024లో క్వింటాల్కు రూ. 2,300కి అంటే రూ.117 మాత్రమే పెరిగింది. అంటే పెంపు కేవలం 5.3శాతం మాత్రమే. మరో పంట కందులు రిటైల్ కిరాణా దుకాణాల్లో కిలో రూ.240కి విక్రయిస్తున్నారు, కొత్త మద్దతుధర ప్రకారం రైతులకు కిలోకు రూ.75 (కేవలం 7.3శాతం) మాత్రమే పెరుగుదల నమోదైంది. నూనె గింజల పంట అవిశెలు, రాగుల కనీస మద్దతు ధర వరుసగా 12.7శాతం, 11.5శాతం నమోదైంది.
స్వావలంబనను ప్రోత్సహించడానికి పప్పుధాన్యాలు, నూనె గింజలకు మద్దతుధర పెరుగుదల గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవానికి అవిశెలు మినహా అన్ని పంటల్లో కనీస మద్దతు ధర చాలా తక్కువగా ఉంది. కొత్త మద్దతు ధరలు సాగు ఖర్చులకు కూడా సరిపోవడంలేదు. 20222023 వినియోగంలో దిగుమతులు దాదాపు 14శాతం కాగా, దీనిలో 2.53 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు 46.5 లక్షల టన్నులు ఉన్నాయి. దాదాపు 3.74 బిలియను డాలర్లు (2022లో 1.94 బిలియన్ డాలర్లు) చెల్లించాం. నూనె గింజల్లో కూడా వినియోగంలో 28 శాతం కొరత ఉంది. ప్రభుత్వం 18.0 బిలియన్ డాలర్లు చెల్లించి 120 లక్షల టన్నుల ఆయిల్ పామ్, సన్ఫ్లవర్, ఇతర నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్, రష్యాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ సంవత్సరం బిల్లు 20.0 బిలియన్ డాలర్లు కానుంది. దిగుమతులపై భారీ వ్యయంచేసే బదులు, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు సరైన మద్దతు ధరలను అందించడం ద్వారా మన ప్రభుత్వం కేవలం సగం మొత్తాన్ని రైతులకు చెల్లించవచ్చు. చాలా వరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు పేద, చిన్న రైతులు వర్షాధార పరిస్థితులలో సాగుచేస్తారు కాబట్టి ధరల పెరుగుదల కష్టాలనుంచి వారికి ఉపశమనం కలిగిస్తుంది. పెరిగిన సాగు ఖర్చులు ఉత్పత్తి వ్యయంలో 50శాతం అదనంగా చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది పచ్చి అబద్ధం. 2014-24 మధ్యకాలంలో డీఏపీి, డీజిల్, పత్తి విత్తనాలు, రవాణా ఛార్జీలు వంటి ఇన్పుట్ల ధరలు మూడు రెట్లు పెరిగాయి. అయినప్పటికీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీపీసీఏ, ఎంఎస్పీల గణనలో సాగుఖర్చు కోసం 2011-12ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తోంది. బదులుగా, ప్రస్తుత సీజన్లో కనీస మద్దతుధర (ఎంఎస్పీ)ని లెక్కించడానికి ప్రభుత్వం గత సంవత్సరం ఇన్పుట్ ఖర్చులను ప్రాతిపదికగా పరిగణించాలి. అంతేకాకుండా, కుటుంబ శ్రమ భాగం చాలా లోపభూయిష్టంగా ఉంది. 2.4 ఎకరాల కౌలు, చిన్న రైతులు 84శాతం మంది వున్నారు. వారి కుటుంబాలు తెల్లవారడంతోనే పొలాల్లో శ్రమిస్తాయి. సాగు ఖర్చులలో 30శాతం వరకు శ్రమచేస్తారు. కానీ దీనికి ప్రభుత్వం క్వింటాల్కు రూ.125 మాత్రమే చెల్లించింది. వాస్తవానికి పంట సీజన్లో వరి ఉత్పత్తి క్వింటాల్కు కుటుంబ కార్మికుల శ్రమ భాగం దాదాపు రూ.700 అవుతుంది. కొత్త ఎంఎస్పీలను శాస్త్రీయంగా (జ2 G50) గణించాలి, మునుపటి సీజన్ సాగు ఖర్చులను ప్రాతిపదికగా తీసుకోవాలి. పంట కనీస మద్దతుధరలు పెంపును టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్)కి అనుసంధానం చేయాలి.
ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటి ఇన్పుట్లపై జీఎస్టీని తీసివేయాలి.
ఎరువులు, డీజిల్, క్రిమిసంహారకాల ధరలపై పరిమితి విధించాలి.
మార్కెట్లలో ప్రకటించిన కనీస మద్దతుధరల హామీ చెల్లింపుకోసం చట్టాన్ని తీసుకురావాలి. ఇటీవలి ఎన్నికల్లో రైతుల క్రోధానికి గురై పరాజయం పాలైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదు.
పంట కొత్త మద్దతు ధర గత సంవత్సరంతో
(రూపాయల్లో) పోలిస్తే పెరుగుదల
వరి 2,300 5.3%
కందులు 7,550 7.5%
పత్తి 7,121 7.5%
వేరుశనగ 6,783 6.4%
రాగులు 4,290 11.5%
అవిశెలు 8,717 12.7%