ముంబై: భారత క్రికెట్ జట్టు గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనంతరం భారత్ మరో ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. ఇటీవల రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరినప్పటికీ ఖాళీ చేతులతోనే రోహిత్ సేన తిరిగివచ్చింది. ఈ నేపథ్యంలో అనేకమంది విమర్శలు గుప్పిస్తూ.. టీమిండియాకు ‘చోకర్స్’ ట్యాగ్ను తగిలిస్తున్నారు. కీలక టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్లను ఉద్దేశించి క్రికెట్ పరిభాషలో ‘చోకర్స్’గా అభివర్ణిస్తారు. అయితే… టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై స్పందించాడు. భారత జట్టుకు ఇలాంటి ట్యాగ్ తగిలించడం సరికాదని పేర్కొన్నాడు. టీమిండియా బలమైన జట్టని, ఇటీవల ఐసీసీ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకూ చేరుకుందని వివరించాడు. ‘నేనైతే అలా అనను. మూడు ప్రపంచకప్లు గెలిచే అవకాశం ఉన్న రెండు జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమే. పెద్ద టోర్నీల్లో మనం బోల్తా పడుతున్నామని కాదు. మనం సెమీ ఫైనల్స్కు చేరుకున్నాం. ఫైనల్స్ వరకూ వెళ్లాం’ అని శాస్త్రి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వివరించాడు. ఇక ఐసీసీ ట్రోఫీలను గెలవనందుకు వ్యక్తి గతంగా విమర్శలు చేయొద్దని సూచించాడు. ‘పెద్ద టోర్నీల్లో గెలవాలంటే.. సమష్టి కృషి అవసరం. వైఫల్యాలకు ఒక వ్యక్తినో, సారథినో నిందించ లేరు’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో గెలవాలంటే… బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్లు రావాల్సిన అవసరముందని శాస్త్రి స్పష్టం చేశాడు. బ్యాటర్లు శతకాలు బాదితే… బౌలర్లకు సులవవుతుందని, ట్రోఫీ గెలుచుకునే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పాడు. ‘ టీ20, టెస్టు, వన్డేలు ఏ ఫార్మాటైనా… మీరు శతకం చేయలేకపోతే.. కనీసం మూడు అర్ధ శతకాలు ఉండేలా చూసుకొండి. అలా చేయకపోతే.. మీకు గెలిచే అర్హత లేదు’ అని పేర్కొన్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్లో పర్యటించనుంది. ఆ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.