ముంబై: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల అవడమే ఆలస్యం.. ఫేవరెట్లు ఎవరు? సెమీస్ చేరే జట్లు ఏవి? అనే చర్చలు ఊపందుకున్నాయి. కాగా ప్రపంచకప్పై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వరల్డ్ కప్ మామూలుగా ఉండదని, హోరాహోరీ పోరు ఖాయమని అన్నాడు. ‘సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడడం కచ్చితం గొప్ప అనుభవం. భారత జట్టు 12 ఏళ్ల క్రితం ఇక్కడే విశ్వ విజేతగా అవతరించింది. దాంతో, ఈసారి మాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీమిండియాను మైదానంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈసారి వరల్డ్ కప్ మామూలుగా ఉండదు. ప్రతి మ్యాచ్లో హోరా హోరీ పోరు ఖాయం. ఎందుకంటే..? గతంలో కంటే ఇప్పుడు ఆట మారిపోయింది. ప్రతి జట్టు సానుకూల దృక్ఫథంతో బరిలోకి దిగనుంది. దాంతో, ఈ ఏడాది అభిమానులు చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ చూస్తారు’ అని రోహిత్ తెలిపాడు.