చండీగఢ్: భారత్లోని పది వేదికల్లో వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇటీవల ఐసీసీ షెడ్యూల్ను కూడా ప్రకటించింది. అయితే, తమ రాష్ట్రంలో మ్యాచ్లను నిర్వహించక పోవడంపై పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ హయర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను వీడియో రూపంలో వ్యక్తం చేసిన మంత్రి… తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి లేఖ రాశారు. మైదానాల కేటాయింపు విషయంలో సరిగా వ్యవహరించలేదని ఆ లేఖలో విమర్శలు గుప్పించారు. మొహాలీలో కొన్ని మ్యాచ్లను కేటాయించాలని కోరారు. ‘‘క్రీడల్లో దేశానికి పంజాబ్ ఎందరో గొప్ప ఆటగాళ్లను అందించింది. వారిలో కొందరు ఫ్రంట్ రన్నర్గా, జాతీయ జట్టు తరపున ఫ్లాగ్ బేరర్గా నిలిచారు. క్రికెట్లో అయితే లాలా అమర్నాథ్, బిషన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్నాథ్, యశ్పాల్ శర్మ, మదన్లాల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, దినేశ్ మోంగియా, హర్విందర్ సింగ్, విక్రమ్ రాథోడ్, శరన్దీప్ సింగ్, శుభ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్.. లాంటి మేటి క్రికెటర్లను అందించింది. మొహాలీ మైదానం రెండు ప్రపంచకప్ సెమీస్లకు అతిథ్యం ఇచ్చింది. అలాంటి పంజాబ్ ప్రపంచకప్ నిర్వహణలో భాగం కాకపోవడం సరికాదు’’ అని గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇందులో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.