Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆవేశ్‌పై వేటు… షమీకి దక్కని చోటు

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

న్యూదిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2022 బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ సోమవారం వెల్లడిరచింది. అంతా ఊహించనట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ పునరాగమనం చేయగా.. ఆసియాకప్‌ 2022లో విఫలమైన ఆవేశ్‌ ఖాన్‌పై వేటు పడిరది. టీమ్‌ కాంబినేషన్‌ నేపథ్యంలో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను కూడా టీమ్‌మేనేజ్‌మెంట్‌ పక్కనపెట్టి స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. మహమ్మద్‌ షమీ జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగినా అతన్ని బుమ్రా బ్యాకప్‌గా మాత్రమే సెలెక్టర్లు పరిగణించారు. అతనితో పాటు దీపక్‌ చాహర్‌, రవి బిష్ణోయ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఆసియాకప్‌ బరిలోకి దిగిన జట్టులో కేవలం మూడు మార్పులు మాత్రమే చేశారు. గాయంతో దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకున్నారు. రిషభ్‌ పంత్‌ను పక్కనపెడతారని ప్రచారం జరిగినా.. లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్‌ నేపథ్యంలో దినేశ్‌ కార్తీక్‌తో పాటు కొనసాగించారు. బౌలింగ్‌ విభాగంలో రెండు మార్పులు మినహా జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. బ్యాటింగ్‌ విభాగంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్యాలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వాస్తవానికి జట్టును ప్రకటించేందుకు చివరి గడువు సెప్టెంబర్‌ 16 అయినప్పటికీ.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల నేపథ్యంలో ముందుగానే సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. గాయాలతో ఆసియాకప్‌కు దూరమైన హర్షల్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా గాయాల అప్‌డేట్‌ కోసం ఇన్నాళ్లు వేచి చూసిన సెలెక్టర్లు.. శనివారం వారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసిన నేపథ్యంలో సోమవారం హుటాహుటిన సమావేశమై జట్టును ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టోర్నీలకు కూడా బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌ల్లో మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహార్‌లకు తుదిజట్టులో అవకాశం దక్కింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టోర్నీకి ఎంపికైన భువనేశ్వర్‌ కుమార్‌, హార్ధిక్‌ పాండ్యా… సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉంటారు. ఇదే సమయంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆస్ట్రేలియాతో సిరీస్‌కి దూరంగా ఉంటాడు. మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహార్‌ ఈ రెండు సిరీస్‌ల్లో పాల్గొంటారు.
భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌(కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌
స్టాండ్‌ బై ప్లేయర్స్‌: మహమ్మద్‌ షమీ, శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, దీపక్‌ చాహర్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img