అబుదాబి: వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ 2022 సీజన్ 15వ ఎడిషన్ నాటికి ఎంఎస్ ధోని అందుబాటులో ఉంటాడా? లేడా? అనే విషయంపై ఇదివరకే డిబేట్స్ సాగాయి. వయసు మళ్లడం వల్ల ఇక ధోని ఐపీఎల్కు గుడ్బై చెబుతాడని, అతనికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సీజన్ ముగిసిన తరువాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే అనుమానాలు తలెత్తాయి. వాటన్నింటినీ పటాపంచలు చేశాడు తలైవా. 2022 సీజన్లో ఆడబోతున్నాననే హింట్ ఇచ్చాడు. నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు గానీ.. తన ఫేర్వెల్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో ఉంటుందని హామీ ఇచ్చాడు. తోటి ప్లేయర్లు దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, శార్దుల్ ఠాకూర్లతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ యూట్యూబ్ పేజ్లో అభిమానులతో ఇంటారాక్ట్ అయ్యాడు ధోనీ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. చెపాక్ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ ఆడతాననే భరోసా ఇచ్చాడు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నమెంట్లో ఆడే అవకాశం ఉండటం వల్లే ధోనీ.. తన అభిమానికి ఈ ప్రామిస్ చేశాడు. తన ఫేర్వెల్ మ్యాచ్ చెపాక్లో ఉంటుందని స్పష్టం చేశాడు.