విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ చౌడేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో నడిపిస్తున్న రక్తదాన శిబిరాలను మెచ్చి, అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు వినోద్ కుమార్ బీరే శ్రీరాములకు జ్ఞాపిక తో పాటు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీరే శ్రీరాములు మాట్లాడుతూ తాను శ్రీ చౌడేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో పలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, రక్తం యొక్క అవసరాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ నా బాధ్యతను నిర్వర్తిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు 16 సార్లు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, ఇందులో నాలుగు సార్లు రెడ్ క్రాస్ సంస్థకు రక్తాన్ని ఇవ్వడం జరిగిందని, మరి 12 సార్లు జరిపిన వాటిని స్థానిక, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. రక్తదాన శిబిరమ్మ ల నిర్వహణలో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, సహాయ సహకారాలు అందించిన రక్త దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డు ఈ సత్కారం వారికే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి సేవా సమితి సభ్యులు ఉమ్మడిశెట్టి ప్రసాద్, దాసరి శివ, మేకల శివయ్య, పడిగేరి నాగరాజు తదితరులు బీరే శ్రీరాములకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.