జాతీయ చేనేత మహిళ సభ్యురాలు జయశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) దేశంలోనే వ్యవసాయం తర్వాత రెండవ స్థానంలో ఉన్న చేనేత పరిశ్రమను, వాటి ఉనికిని కాపాడుకోవాలంటే ఐక్యమత్యంతోనే సాధించవచ్చునని జాతీయ చేనేత మహిళ సభ్యురాలు జయశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను వెల్లడిస్తూ, తొలుత 2024వ సంవత్సరానికి 21 కులాల వారికి,పుర ప్రజలకు నూతన సంవత్సరము, సంక్రాంతి పండుగ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా చేనేత పరిశ్రమను ఆధారపడిన వారందరూ కూడా ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటూన్న తరుణములో పట్టు వ్యాపారస్తుల సంఘమును ఏర్పాటు చేసి, ఈ సంఘం ఆధ్వర్యంలో అఖిలభారత చేనేత కుల సంఘాల సమైక్య నేతృత్వంలో అన్ని కులాల వారిని ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించి, చేనేత పరిశ్రమలు కాపాడుకొనుటలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ముందు తరాలకు ఎలా వెళ్లాలి? అన్న విషయాలను సమావేశంలో తెలపడం జరిగిందన్నారు. 21 కులాల ఐక్యతను కోరుకోవడమే మా యొక్క లక్ష్యము అని తెలిపారు. చేనేతను కాపాడుకుంటూ, ముందు తరాలకు అందించేలా సరి అయిన నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు. చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ అవినాభావ సంబంధంతో ఉన్నప్పుడే సమస్యలను సులభతరంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, అప్పుడే చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలుగుతుందని తెలిపారు. చేనేత యొక్క ఉనికిని ఆత్మగౌరవంతో తాము ముందుకు వెళుతున్నామని, ఎటువంటి రాజకీయ లబ్ధిని కూడా ఆశించడం లేదని వారు స్పష్టం చేశారు. చేనేతను నమ్ముకున్న వారందరికీ తాము ఒక చిహ్నంగా నిలబడుటే మా లక్ష్యం అని తెలిపారు. కాబట్టే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన చేనేత పరిశ్రమను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. మున్ముందు మా కమిటీ ఆధ్వర్యంలో చేనేత పరిశ్రమలు, కార్మికులను కాపాడుకోవడంలో ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. త్వరలో కదిరిలో మహాసభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.