ఈనెల 18వ తేదీన మాంగల్య షాపింగ్ మాల్ వద్ద రెండు వేల మందితో ధర్నా
మాంగల్య షాపింగ్ మాల్ మూసేంతవరకు నిరాహార దీక్షలతో పాటు ఆత్మహత్యలకు కూడా వెనుకాడేది లేదు
రాజకీయ జోక్యం వల్లనే నేడు పట్టణంలో వ్యాపారస్తులకు తీవ్ర నష్టాలు
పట్టణ వ్యాపారస్తులంతా కలిసికట్టుగా ఉద్యమిస్తేనే, పట్టణంలో వ్యాపారాలు కొనసాగుతాయి
ధర్మవరం పట్టుచీరలు తయారీ అండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, గౌరవ అధ్యక్షులు కలవల రాంకుమార్, రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటి వెంకటేష్
విశాలాంధ్ర-ధర్మవరం;; మాంగల్య షాపింగ్ మాల్ తొలగించేంతవరకు మా పోరాటాలు ఆగవని, ఈనెల 18వ తేదీన మాంగల్య షాపింగ్ మాల్ వద్ద 2000 మంది వ్యాపారస్తులతో ధర్నా చేస్తామని, మాంగల్య షాపింగ్ మాల్ మూసే అంతవరకు నిరాహార దీక్షలతో పాటు తాము ఆత్మహత్యలకు కూడా వెనుకాడేది లేదని, రాజకీయ జోక్యం వల్లనే నేడు పట్టణంలో వ్యాపారస్తులకు తీవ్ర నష్టాలు కలుగుతున్నాయని, పట్టణ వ్యాపారస్తులంతా కలిసికట్టుగా ఉద్యమిస్తేనే పట్టణంలో వ్యాపారాలు కొనసాగుతాయని.. ధర్మవరం పట్టుచీరల తయారీ అండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, గౌరవ అధ్యక్షులు కలవల రామకుమార్, రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటి వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సెమీ నారాయణ స్వామి దేవాలయంలో పట్టణ వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభించడంతో వ్యాపారస్తులకు కలుగుతున్న నష్టాలు, జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారిందన్న అంశాలపై వారు తీవ్రంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ షాపింగ్ మాల్ ధర్మవరంలో ప్రారంభించడం వల్ల చిన్న, పెద్ద, రెడీమేడ్ వ్యాపారస్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో మా సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి విన్నవించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయిందని, నేడు మా వ్యాపారాలు డీలా పడ్డాయని, మా కుటుంబ పోషణ, పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి షాపింగ్ మాల్ రాకుండా వ్యాపారస్తులంతా ఏకధాటిగా నిలబడి మా ధర్మవరం వ్యాపారాన్ని కొనసాగించేలా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. అందుకే భారీ ఎత్తున ఈనెల 18వ తేదీ పట్టణంలోని పుట్లమ్మ గుడి నుండి దాదాపు 2000 మంది వ్యాపారస్తులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ, మాంగల్య షాపింగ్ మాల్ వద్ద ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. పట్టణంలో దాదాపు 40 వేల మగ్గాలు ఉన్నాయని, చీరలు నే సినా కూడా అవి విక్రయానికి నోచుకోవడం లేదని తెలిపారు. అతి తక్కువ రేటుకు అమ్మడం, కేజీల ప్రకారం నాసి సరుకులను అమ్మడం, ప్రజలను మభ్యపెడుతూ వారి వ్యాపారాన్ని మూడుపువ్వులు- ఆరు కాయలుగా చేసుకోవడం దారుణం కాదా? అని తెలిపారు. ప్రజలు కూడా గమనించాలని, తక్కువ రేటు, కేజీలకు వస్త్రాలను అమ్మడంలో చాలా లోపాలు ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలని వారు కోరారు. ఇలాంటి షాపింగ్ మాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత సరుకులు తెచ్చి, డిస్కౌంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ విక్రయించడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేజీల ప్రకారం అమ్ముకోవడంలో కూడా షాపింగ్ మాల్కు ఎంతో లాభం ఉందని వారు దుయ్యబట్టారు. ప్రజలను వెర్రి వాళ్లను చేసి మాంగల్య షాపింగ్ వాళ్లు తమ వ్యాపారాన్ని దిన దినాభివృద్ధి చేసుకోవడం జరుగుతోందని, ఇది ప్రజలందరూ గుర్తించాలని వారు తెలిపారు. ఆనాడు రాజకీయ నాయకులు సపోర్టు చేయడం వల్లనే మాంగల్య షాపు రావడం జరిగిందని, ప్రజలు వ్యాపారస్తులు ఏమీ చేయలేక తమ జీవనోపాధిని కోల్పోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చిన్న, పెద్ద వ్యాపారస్తులు మూసివేయడం జరిగిందని, వారి జీవనోపాధి కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మా వ్యాపార సంస్థలను కాపాడుకోవడానికి మా పోరాటాలు ఆపమని, నిరంతర ప్రక్రియ దిశలో మాంగల్య షాపు ముందు వివిధ రకాల లో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి తీరుతామని వారు స్పష్టం చేశారు. ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వంకు, స్థానిక ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ కు కూడా తమ గోడు విన్నవించుకున్నామని, సమస్యలు పరిష్కారమయ్యేలా సత్వరమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఏళ్ల తరబడి చేసుకుంటున్న మా వ్యాపార సంస్థలు మూసివేస్తే… మాకు దిక్కు ఎవరు? అని వారు ప్రశ్నించారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాంగల్య షాపింగ్ మాల్ వంటి వాటిని వెంటనే ధర్మవరం నుండి తొలగింప చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రిటైల్ వ్యాపారస్తులు రంగం రామకృష్ణ, నవీన్, గిర్రాజు శశిధర్, గుండా పుల్లయ్య, నీలూరి శ్రీనివాసులు, గుద్దిటి నాగభూషణం, రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బి ఎం.భాష, శేషాద్రి రెడ్డి, ఉపాధ్యక్షులు రామచంద్ర, ధనుంజయ, కార్యదర్శి మురళి, కోశాధికారి సుధాకర్, సభ్యులు హరికృష్ణ, సలీం బాషా తో పాటు అధిక సంఖ్యలో పట్టణ వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.