జిల్లా కేంద్రంలో 7 వెన్యూ కేంద్రాలలో పరీక్షలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు – 2024ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు – 2024పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలను నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలను జూన్ 16వ తేదీన ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలకు 2,795 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. జూన్ 16వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 7 వెన్యూ కేంద్రాలలో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మొత్తం పరీక్షలను పర్యవేక్షణ చేయడానికి 7 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లను, 7 మంది రూట్ మరియు స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల ఎంట్రెన్స్ వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని, మొబైల్ టాయిలెట్స్, మెడికల్ టీంలను ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా పరీక్ష కేంద్రాలకు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ మరియు ఇంటర్నెట్ కేంద్రాలను మూసి వేయించాలని, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం సెషన్ ప్రారంభానికి 30 నిమిషాల ముందు ముగుస్తుందన్నారు. పెన్, పెన్సిల్, ఇ-అడ్మిట్ కార్డ్, సెల్ఫ్ ఫోటోలు, ఐడి ప్రూఫ్ లేదా ఇ-అడ్మిట్ కార్డ్లో పేర్కొన్న ఏదైనా ఇతర వస్తువులను మాత్రమే వేదిక లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు – 2024 కోసం అనంతపురం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ (నెంబర్ 8500292992) ను అభ్యర్థులు ఉపయోగించుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ ఈనెల 15, 16వ తేదీలలో రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు పనిచేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, సివిల్ సర్వీసెస్ జిల్లా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ హిమాంశు కుమార్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి,.అడిషినల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు నరసింహారెడ్డి, అశోక్ కుమార్, రాజశేఖర్, కళ్యాణి, రజిత, తిప్పేస్వామి, రూట్ ఆఫీసర్లు మరియు స్పెషల్ అధికారులు రామ సుబ్బారెడ్డి, ప్రభాకర్ రావు, శిరీష, సుబ్రహ్మణ్యం, ఓబులమ్మ, ఎర్ర స్వామి, రఘునాథరెడ్డి, డిఎంహెచ్వో డా.ఈబి.దేవి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, వెన్యూ సూపర్వైజర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.