ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారుల బృందం
సోలార్ విద్యుత్ తప్పనిసరి
డబుల్ బెడ్రూమ్ గృహాలపై భట్టి ఆరా
విశాలాంధ్ర-హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధ్యయనం చేయించి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హౌసింగ్, రెవెన్యూ, ఐఅండ్పీిఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి బడ్జెట్లో ప్రజాప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఆరు గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమన్నారు. ఇతర రాష్ట్రాల్లో పేదలకు అక్కడి ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఇళ్ల నమూనాలు, లబ్ధిదారుల ఎంపిక విధానంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సూచించారు. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందున ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ మహానగరంగా శరవేగంగా అభివృద్ధ్ది చెందుతున్న నేపథ్యంలో అవుటర్, రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత హౌసింగ్ శాఖపై ఉందని గుర్తు చేశారు. ఎస్ ఆర్ నగర్, బర్కత్పుర, కూకట్పల్లి, ఈసిఐఎల్ తదితర ప్రాంతాల్లో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేరిట ఇళ్లు నిర్మించడంతో మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరిందని వివరించారు. రెవెన్యూ శాఖ నుంచి భూమిని సేకరించుకోవాలని సూచించారు. అనువైన ప్రాంతాలను గుర్తించి, ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమి ప్రతిపాదనలు రెవెన్యూ శాఖకు పంపాలని సూచించారు. మూడు బృందాలుగా అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు వెల్లడిరచారు. చెన్నై, బెంగళూర్, ముంబై నగరాలకు వెళ్లి అన్ని విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో గత ప్రభుత్వం లక్ష ఇళ్లు లక్ష్యంగా పెట్టుకొని 69 వేలు మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసిందని అధికారులు వివరించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
ధరణి పెండిరగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. డిజిటల్ భూ సర్వే చేయడానికి నిధులను ఇవ్వాలని అధికారులు డిప్యూటి సీఎంను కోరారు. సంపద సృష్టించి ఆ సంపదను ఈ రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులను సమీకరించడంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.