కాంగ్రెస్పై మండిపడ్డ కేటీఆర్
విశాలాంధ్ర – హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవన్నీ దివాలాకోరు ప్రచారం, తప్పుడు ఆరోపణలేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆర్థిక, రాజకీయ వీక్లీలో ప్రచురితమైన అర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, వనరుల నిర్వహణ సూచీలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సహా కాంగ్రెస్ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థమవుతుందని తెలిపారు. ఆర్థిక నిర్వహణలో 2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న సూచీని కేటీఆర్ ట్విట్టర్లో పంచుకున్నారు. అప్పుల నిర్వహణ, వనరుల నిర్వహణ సూచీలోనూ తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆర్థిక, రాజకీయ వీక్లీలో ప్రచురితమైన ఈ సూచికలను కేటీఆర్ ప్రజల ముందుంచారు. కేసీఆర్ అధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆర్థిక నిర్వహణతో పాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో ఈ ఇండెక్స్లోని గణంకాలే సాక్ష్యమని చెప్పారు. సత్యాలు, వాస్తవాలు ఇలా ఉంటే… కాంగ్రెస్ నాయకులు మాత్రం పొద్దున లేస్తే దివాలా తీసిన రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. హామీలను అమలు చేయడం చేతగాక అప్పులపై తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థిక స్థితిపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా అనేక సార్లు పక్కా లెక్కలతో సభ బయట, వెలుపలా వాస్తవాలను వెల్లడిరచామని ఆయన చెప్పారు. సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తీసుకున్న అప్పులు కూడా దీర్ఘకాలం కావటంతో వాటిపై వడ్డీల చెల్లింపు భారం కూడా స్వల్పమేనన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల్లో సింహాభాగం మూలధన వ్యయం చేశారని, తద్వారా ఆస్తులు, సంపద సృష్టి జరిగిందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవమన్నారు. జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తిలో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అగ్ర స్థానంలో నిలిపారని గర్వంగా చెబుతానన్నారు. తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఇప్పటికైనా ప్రజలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి గాడిన పెట్టిన ఆర్థిక వ్యవస్థను చేతకాని విధానాలతో నాశనం చేయవద్దని ఆయన సూచించారు.