ఇన్నర్, ఔటర్ రింగ్రోడ్ల భూసేకరణ పూర్తి చేయాలి
డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం: సీఎం రేవంత్రెడ్డి
విశాలాంధ్ర-హైదరాబాద్ : వరంగల్ను హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. అవసరమయ్యే నిధుల పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తాగునీటి పైప్లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రతి 20 రోజులకోసారి ఇన్ఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.
మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్లు ఎలా పెంచుతారు?
తొలుత వరంగల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. ఆసుపత్రి నిర్మాణంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ.1,100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1,726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్లు ఎలా పెంచుతారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమేంటని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చిచెప్పారు. రాజకీయ ప్రేరేపిత బదిలీలు, రాజకీయ అవసరాల కోసం బదిలీలు ఉండవన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం మన కర్తవ్యమని అన్నారు. 45 రోజుల్లో వరంగల్ అభివృద్ధిపై మరో సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు హనుమకొండ ఐడీఓసీలో ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ను సీఎం ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కావ్య, బలరాం నాయక్ పాల్గొన్నారు.
మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణ
మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శంషాబాద్లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఫార్మారంగం ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్కు స్థానం ఉంటుందని, ఇందుకు కారణం ఇందిరాగాంధీ దూర దృష్టి అన్నారు. రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. నగరానికి త్వరలో ఎయిర్ పోర్ట్ రాబోతోందన్నారు. టెక్స్టైల్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. వరంగల్లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తానన్నారు.