ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మంత్రి, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడిగా సేవలు
నేడు నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
విశాలాంధ్ర-హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం మృతదేహాన్ని నిజామాబాద్ కు తరలించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ … ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు. డీఎస్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. చిన్న కుమారుడు అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డీఎస్ 1948 సెప్టెంబరు 27న జన్మించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన నిజామాబాద్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకామ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన ఎన్ఎస్యూఐ లో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1982 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలి అడుగువేసిన ఆయన, మాజీ మంత్రి ఆర్గుల్ రాజారాం శిష్యుడిగా గుర్తింపు పొందారు. 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా, 2004-08 మధ్య కాలంలో ఉన్నతవిద్య, అర్బన్, లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్తో కలిసి కృషి చేశారు. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గమనార్హం. సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డీఎస్కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2013-15 వరకూ శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తండ్రి దూరమవడంపై కుమారుడు అర్వింద్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘అన్నా అంటే నేనున్నానని… ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే, పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్నా… నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు… నాలోనే ఉంటావు’ అని అర్వింద్ కన్నీరుమున్నీరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్ర చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఆదివారం జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ను సీఎం ఆదేశించారు.
రాజకీయపక్షాల నేతల నివాళి
డీఎస్ మరణవార్త అని పార్టీల నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. డీఎస్ మరణవార్త తెలియగానే హైదరాబాద్ లోని ఆయన నివాసానికి శనివారం అన్ని రాజకీయ పక్షాల నాయకులు తరలివచ్చారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జే కృష్ణారావు తమ సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఏనుగు రాజేందర్, ఆకుల రజిత్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
నారాయణ సంతాపం
డీ.శ్రీనివాస్ మృతికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. డిఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారని పేర్కొన్నారు. విద్యార్ధి దశనుంచి డీఎస్తో తనకు అనుబంధమున్నదని చెప్పారు.