మూసీ ప్రక్షాళనపై మంత్రి సీతక్క
విశాలాంధ్ర`హైదరాబాద్: పదేండ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్ర ప్రభుత్వం ఎదుట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేతలు మొదట ధర్నాలు చేయాలని పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మంగళవారం డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గం గుండా మూసీ పారుతున్నా ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల ధర్నాకు పిలువునివ్వడం ఎందుకని ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజల పక్షాన ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాను విరమించుకోవాలని సీతక్క సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవన రేఖగా భావించే మూసీ పునరుజ్జీవనం కోసం రూ.10 వేల కోట్లను మంజురు చేయించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం వరదల్లో మూసీ ప్రాంత ప్రజలు నష్టపోయినప్పుడు బండికి బండి ఇస్తామని, ప్రతి ఇంటికి నష్టపరిహారం అందిస్తామని హమీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా ఆదుకోలేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రాంత అభివృద్దిని అడ్డుకుంటూ బీజేపీ తన నైజాన్ని బయటపెట్టుకుంటుం దని ఆరోపించారు. గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ… ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తుందని సీతక్క ప్రశ్నిం చారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇతర నదుల ప్రక్షాళనకు రూ.6 వేల కోట్ల మంజూరు చేసిందని తెలిపారు. కానీ మూసీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం పైసా కేటాయించకపో వడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? ఆ వివక్షతను మీరెం దుకు ప్రశ్నించలేదు? అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు మానుకుని… సొంత నియోజకవర్గం గుండా పారుతున్న మూసీ అభివృద్ధి కోసం పైసా తీసుకురాని కిషన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని మంత్రి కోరారు.