నేడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాలకు శంకుస్థాపన
విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్య… బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం వివిధ జిల్లాల్లోని 28 ప్రాంతాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. మొదటి దశలో చేపట్టనున్న శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్లతో గురువారం సాయంత్రం సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్లో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గం లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తారని సీఎస్ వివరించారు. సంబంధిత జిల్లాల మంత్రుల, ఇంచార్జ్ మంత్రుల ఆమోదం పొందిన అనంతరం అత్యంత ఉత్సవ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కాగా, కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్ చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేటలో పాఠశాలలకు శంకుస్థాపన చేస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అజిత్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు.