కాంగ్రెస్కు డి.రాజా హితవు
న్యూదిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన కాంగ్రెస్పార్టీ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఈ ఓటమి ద్వారా నేర్చుకున్న గుణపాఠాలను రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలుచేయాలని భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా కోరారు. ఇండియా ఐక్యసంఘటన పార్టీలు హర్యానాలో వేరువేరుగా పోటీ చేయడంతో బీజేపీ మూడోసారి విజయం సాధించింది. పొత్తులు కుదరకపోవడంతో చివరి నిమిషంలో ‘ఇండియా’ మిత్రపక్షాలు అతి విశ్వాసంతో వేరువేరుగా పోటీచేసి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించాలని రాజా ఒక ప్రకటనలో సూచించారు. త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డి.రాజా ఈ హెచ్చరిక చేశారు. ఇండియా భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోకూడదన్న కాంగ్రెస్ ఆలోచన హర్యానాలో ఆ పార్టీకి బెడిసికొట్టిందని విమర్శించారు. హర్యానాలో ‘ఇండియా’ పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఉండాల్సింది కాదని పీటీఐ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్న విషయం జమ్మూకశ్మీరు ఎన్నికల్లో రుజువైందని చెప్పారు. ఇండియా భాగస్వామ్య పార్టీలు పరస్పర అవగాహనతో, విశ్వాసంతో కలిసి పనిచేయాలని, సీట్ల సర్దుబాట్ల విషయంలో పరస్పర అనుకూల పద్ధతులలో సర్దుకుపోవాలన్నారు. జమ్మూ కశ్మీరులో ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, జమ్మూకశ్మీరులో బీజేపీ అనుసరించిన వినాశకరమైన రాజకీయాలను ప్రజలు తోసిపుచ్చారని డి.రాజా అన్నారు. అఖిలభారతస్థాయిలో అన్ని రాష్ట్రాలలో ‘ఇండియా’ ఐక్యసంఘటన పార్టీలతో కాంగ్రెస్ మరింత అనుకూలమైన పద్ధతులలో సీట్ల సర్దుబాటు విషయంలో వ్యవహరించాలని కోరారు.