. ప్రేమ పేరుతో వంచన
.అడ్డు తొలగించేందుకు యువకుడి కుట్ర
. మైనర్ పరిస్థితి విషమం… నిందితుడి అరెస్ట్
విశాలాంధ్ర-కడప జిల్లా బ్యూరో/ బద్వేలు: ఓ యువకుడు… ప్రేమించిన బాలికను అడ్డుతొలగించుకునేందుకు పథకం ప్రకారం నిప్పు పెట్టి హత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన వైయస్సార్ జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సెంచురీ ప్లైవుడ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేలు పట్టణం రామాంజనేయనగర్లో నివాసం ఉంటున్న దస్తగిరమ్మ (16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే వీధికి చెందిన విఘ్నేశ్ అనే యువకుడితో స్నేహంగా ఉంటోంది. అతడు కడపలో ఓ బంగారు దుకాణంలో పని చేస్తున్నాడు. విఘ్నేశ్కు వివాహమైంది. భార్య గర్భవతి. ఏమైందోఏమో… దస్తగిరమ్మ అడ్డు తొలగించుకోవాలని వ్యూహం పన్నాడు. కళాశాలలో ఉన్న దస్తగిరమ్మకు ఫోన్ చేసి నీవు రావాలని, నిన్ను కలవాలని, నీవు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫోన్ చేశాడు. ఆమె కళాశాల నుంచి ఆటోలో బయలుదేరింది. మార్గమధ్యంలో పాలిటెక్నిక్ కళాశాల వద్ద విఘ్నేశ్ అదే ఆటోలో ఎక్కాడు. ఇద్దరూ పీపీ కుంట వద్ద సెంచురీ ప్లైవుడ్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరిమధ్య ఘర్షణ జరిగింది. విఘ్నేశ్… తన వద్ద ఉన్న లైటర్తో దస్తగిరమ్మ దుస్తులకు నిప్పంటించి పారిపోయాడు. బాలిక కాలిన గాయాలతో కేకలు వేస్తూ నడుచుకుంటూ వస్తుండడాన్ని ఓ లారీ డ్రైవర్, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ నాగభూషణం, అర్బన్ ఎస్.ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కడప ప్రభుత్వ ఆసుపత్రి(రిమ్స్) కు తరలించారు. బాలిక శరీరం 80 శాతం కాలిందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు బద్వేలు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని సీఐ నాగభూషణం తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
కాగా, జిల్లా ఎస్పీ వీ హర్షవర్థన్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బద్వేలు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. బాధితురాలు దస్తగిరమ్మకు 80 శాతం కాలిన గాయాలు ఉన్నాయన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలను నియమించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఆటో డ్రైవర్ కోసం వెదుకుతున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
హత్యాయత్నంపై ముఖ్యమంత్రి ఆరా
ఇంటర్ విద్యార్థినికి నిప్పుపెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి బాధితురాలి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికపై జరిగిన హత్యాయత్నంపై జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజుతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం రిమ్స్లో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దస్తగిరమ్మకు, విఘ్నేశ్కు మధ్య అసలేంజరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.