. తాజా ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి అందించిన మంత్రి నారాయణ
. ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఐదు సంవత్సరాలుగా పడకేసిన విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల అంశంపై మళ్లీ కదలిక వచ్చింది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రెండో రోజులుగా దిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు. విభజన చట్టంలో భాగంగా ఏపీకి మంజూరైన విజయవాడ, విశాఖపట్టణం మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి 2014
19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2015వ సంవత్సరంలోనే డీపీఆర్లు కూడా సిద్ధం అయ్యాయి. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను నిలిపివేయడంతో మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి తాజా నివేదికలు సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి ఖట్టర్తో భేటీ సందర్భంగా తాజా ప్రతిపాదనలతో నారాయణ పూర్తి వివరాలు అందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఈ రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
అమృత్ 2 పథకం పనులు కూడా కొనసాగించండి
ఈ భేటీలో అమృత్ 2 పథకం అమలుపైనా ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగింది. అమృత్ పథకం కింద రాష్ట్రంలోని మునిసిపాలి టీలలో వివిధ అభివృద్ధి పనులను నాటి టీడీపీ ప్రభుత్వంలో చేపట్టగా, వాటిని వైసీపీ ప్రభుత్వం కొనసాగించలేదని తెలిపారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు మొత్తం నిలిచిపోయిందని, మరలా ఈ పథకాన్ని ఇప్పుడు కొనసాగి ంచాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారని మంత్రి నారాయణ తెలిపారు.