— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర- అనంతపురం : రక్తదానం చేయడమంటే పునర్జన్మ కల్పించడమే అవుతుందని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభిప్రాయపడ్డారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, కదిరి ప్రాంతాల నుండీ యువత స్వచ్ఛంధంగా పాల్గొని 100 యూనిట్ల రక్తదానం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ప్రతీ ఏటా అక్టో బర్ 21 వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నామన్నారు. సమాజ భద్రత, రక్షణ క్రమంలో పోలీసులు ప్రాణ త్యాగం చేస్తున్నారని… ఆ అమర వీరుల సేవలు, త్యాగాలు స్మరించుకుంటూ సంస్మరణ దినం మరియు వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి పోలీసుల సేవలు, త్యాగాలు, దైనందిన విధులు గురించి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజలు, విద్యార్థులలో అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు చేపడుతామన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో యువత జవాబుదారీతనంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ లేకుండా స్పీడ్ గా వాహనాలు నడపడం… గంజాయి, మద్యంలకు బానిసలు కావడం మనం చూస్తున్నామన్నారు. దీనివల్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు, ఇటుకలపల్లి సి.ఐ హేమంత్ కుమార్, ఎస్సై విజయకుమార్ మరియు జిజీహెచ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.