విశాలాంధ్ర – విజయనగరం రూరల్ : నగరంలోని పూల్బాగ్ ప్రాంతంలో వున్న ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకు 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జె.దయానంద తెలిపారు. ఈ పాఠశాలలో ప్రవేశంకోరే బాలబాలికలు వినికిడి లోపం ఉన్నట్టు సదరం సర్టిఫికేటు, జనన, కుల ద్రువపత్రం, పాఠశాల బదిలీ సర్టిఫికేట్లతో పాటు రైస్ కార్డు లేదా రేషన్కార్డు, ఆధార్, బ్యాంకు అకౌంట్ పాస్పుస్తకం మొదటి పేజీ జిరాక్సు ప్రతితో పాఠశాలలో సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మూగ చెవిటి బాల, బాలికలు యీ పాఠశాలలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. యీ పాఠశాలలో 1వ తరగతిలో చేరేందుకు 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. టి.సి.ఆధారంగా అన్ని తరగతుల్లో ప్రవేశం వుంటుందన్నారు. యీ పాఠశాలలో చేరే విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, హాస్టల్ సౌకర్యంలో భాగంగా భోజన వసతి సౌకర్యాలు, కాస్మెటిక్స్, వినికిడి యంత్రం, 4 జతల బట్టలు(యూనిఫాం), దుప్పట్లు, ట్రంకుపెట్టె, ప్లేటు-గ్లాసు, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, మొదలైనవి ప్రభుత్వం ద్వారానే అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో ప్రవేశానికి ఎలాంటి ప్రవేశ రుసుంలేదని, డొనేషన్లు లేవని పేర్కొన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన, కంప్యూటర్ విద్య, డిజిటల్ క్లాస్ రూం మొదలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చదువు నేర్పించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. యీ పాఠశాలలో చేరేందుకు ఆసక్తికలవారు 9000013640, 9440437629 మొబైల్ నెంబర్లలో సంప్రదించి యీ పాఠశాలలో ప్రవేశంకోసం మరింత సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.